ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు

విజయవాడ : రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు పున్నయ్యచౌదరి, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అంకమ్మచౌదరి చెప్పారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం రెండెకరాలను కేటాయించడం హర్షణీయమన్నారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, కోచ్‌ సుధాకర్‌రెడ్డి పేరున ఏర్పాటు చేసే ఈ అకాడమీకి గుంటూరులోని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ అకాడమీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే అకాడమీకి సీఈవోగా సుధాకర్‌రెడ్డి సతీమణి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సావిత్రి వ్యవహరించనున్నారు. అకాడమీకి స్థలం కేటాయించిన సీఎం వైయ‌స్ జగన్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  

Back to Top