సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమావేశానికి మంత్రిమండలి సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అదే విధంగా రాష్ట్రంలో నివర్ తుపాన్ ప్రభావంపై, భారీ వర్షాలు, పంట నష్టంపై కేబినెట్ చర్చించనుంది. అంతే కాకుండా డిసెంబర్ 25న ఇచ్చే 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీపై, 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి, వైయస్ఆర్ హౌసింగ్ కాలనీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అదేవిధంగా డిసెంబర్ 8న 2.49 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అదే విధంగా కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ భూసేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.