రివర్స్‌ టెండరింగ్‌కు కేబినెట్‌ ఆమోదం  

పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు

మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కి ఇచ్చిన భూములు వెనక్కి

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

అమరావతి: పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుకు అంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.3216.11 కోట్ల టెండర్‌ను గత ప్రభుత్వం నవయుగ సంస్థకు కేటాయించగా, దాన్ని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న వైయస్‌ జగన్ ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా వసూలు చేయాలని నిర్ణయించింది.

అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం ఈరోజు ఉదయం సమావేశమయింది. ఇసుక విధానం, రివర్స్‌ టెండరింగ్‌, ఆర్టీసీ విలీనం తదితర దాదాపు 30 కీలక అంశాలపై సమావేశంలో చర్చ కొనసాగుతోంది. ఆశా వర్కర్లకు వేతనాల పెంపు, మావోయిస్టులపై నిషేధం పొడిగింపు, నవయుగ, మచిలీపట్నం అంశాలపై తొలుత చర్చించారు.
నవయుగకు కాంట్రాక్టు రద్దుతో పాటు ఇప్పటి వరకు పనులు ప్రారంభించక పోవడంతో మచిలీపట్నం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే మావోయిస్టులపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా పలు అంశాలపై చర్చ సాగుతోంది.

Back to Top