అనంతపురం: వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు కావడం పట్ల వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో న్యాయస్థానం తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టు అని అభివర్ణించారు. ప్రశ్నిస్తున్నవాళ్లపై కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే కారుమూరు వెంకటరెడ్డి మీద ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు హత్య అని ఎలా ప్రచారం చేశారు? టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులే హత్య అని ప్రచారం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలోనూ విస్తృతంగా అది హత్య అని ప్రచారం చేశారు. కానీ వారిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కారుమూరు వెంకటరెడ్డిని అక్రమ అరెస్ట్ చేసింది. అంతిమంగా న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగిందని తెలిపారు. వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి, హరనాథ్ రెడ్డి రాజశేఖర్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, భాస్కర్రెడ్డి, ప్రభు తదితరులను అనంత వెంకటరామిరెడ్డి అభినందించారు.