తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతో పాటు, యావత్ మహిళందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని శ్రీ వైయస్ జగన్ అన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని చెప్పారు. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని శ్రీ వైయస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.