అన్ని కుట్ర‌ల‌కు చంద్ర‌బాబే కేంద్ర బిందువు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ఫైర్‌ 

హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడిన  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి

ఫ్యాక్ష‌న్, గ‌న్ క‌ల్చ‌ర్‌, హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించిందే చంద్ర‌బాబు

ఆయ‌న క్షుద్ర రాజ‌కీయాలకు లోకేష్ వార‌సుడు 

చంద్ర‌బాబు లాంటి మ‌నిషి స‌మాజానికి ప్ర‌మాద‌కరం

ఆయ‌న రాష్ట్రానికి సీఎంగా ఉండ‌టం దుర‌దృష్ట‌క‌రం 

ప్రెస్‌మీట్‌లో నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ధ్వ‌జం

హైద‌రాబాద్‌: రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్‌, హ‌త్యా రాజ‌కీయాలు, గ‌న్ క‌ల్చ‌ర్ కి చంద్ర‌బాబు పాల‌నే సాక్ష్య‌మ‌ని, ఎన్టీఆర్ మ‌ర‌ణం నుంచి మొద‌లుపెడితే నేడు జ‌రుగుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల హ‌త్య‌ల వ‌ర‌కు అన్ని కుట్ర‌ల‌కు చంద్ర‌బాబే కేంద్ర బిందువుగా ఉన్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి ధ్వ‌జ‌మెత్తారు. హైద‌రాబాదులోని త‌న నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 80 ప‌దుల వ‌య‌సులోనైనా త‌న నైజం మార్చుక‌ని నాలుగు మంచి ప‌నులు చేసి ప్ర‌జ‌ల్లో పేరు తెచ్చుకోకుండా త‌న క్షుద్ర రాజ‌కీయాల‌కు లోకేష్‌ని వార‌సుడిగా తీర్చిదిద్దుతున్నాడ‌ని ఆక్షేపించారు. పాల‌నా వైఫ‌ల్యాలకు స‌మాధానం చెప్పుకోలేక చంద్ర‌బాబు హ‌త్య‌లను ప్రోత్స‌హిస్తూ వైయ‌స్ఆర్‌సీపీపీ మీద నెపం నెడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను అడ్డం పెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ మీద గొడ్డ‌లి పార్టీ అని బుర‌ద జ‌ల్లుతున్న చంద్ర‌బాబు, ఆయ‌న్ను దారుణంగా చంపాన‌ని ఒప్పుకున్న ద‌స్త‌గిరికి న్యాయ స‌హాయం అందించడం లేదా అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ రాజారెడ్డిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న పార్థ‌సారథిరెడ్డిని, వివేకాను చంపిన ద‌స్త‌గిరిని ఎల్లో మీడియా ఛానెళ్లలో డిబేట్ల‌లో కూర్చోబెట్టి స‌మాజానికి ఏం సందేశం పంపుతున్నాడ‌ని చంద్ర‌బాబుని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు లాంటి వ్య‌క్తి స‌మాజానికే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లే ఆయ‌న్ను రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా పంపేయాల‌ని పిలుపునిచ్చారు. 
ఆమె ఇంకా ఏమన్నారంటే...

చంద్ర‌బాబు గతాన్ని గుర్తుకుతెచ్చుకోవాలి
గురువింద గింజ త‌న న‌లుపు ఎర‌గ‌ద‌న్న‌ట్టు చంద్ర‌బాబు త‌న లోపాలు, పాపాలు మ‌ర్చిపోయి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి చీటికిమాటికీ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు. చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్న‌ట్టుగా ఉంది. చంద్ర‌బాబు పాల‌న‌తోనే రాష్ట్రంలో హ‌త్యారాజ‌కీయాలు పురుడు పోసుకున్నాయి. ఎన్టీఆర్ గారిని మాన‌సికంగా వేధించి కుంగి కృసించి చ‌నిపోయేలా చంద్ర‌బాబే ప్రేరేపించాడ‌నడానికి నేనే సాక్ష్యం. అధికార వ్యామోహంతో రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ‌తో క‌లిసి వేధించాడు. వైస్రాయ్ హోట‌ల్‌కి వెళితే చెప్పులు వేయించి ఘోరంగా అవ‌మానించాడు. కుట్ర‌లు, కుయుక్తుల‌తో ఎన్టీఆర్ నుంచి పార్టీని, పార్టీ జెండాని లాక్కున్న చంద్ర‌బాబు నీతులు చెప్ప‌డం దెయ్యాలు వేదాలు వ‌ల్లించ‌డ‌మే. వైయ‌స్ఆర్‌సీపీని గొడ్డ‌లి పార్టీ అని దుష్ష్ర‌చారం చేస్తున్న చంద్ర‌బాబు త‌న గ‌తాన్ని ఒక‌సారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్టీఆర్ తో చంద్ర‌బాబు మొద‌లుపెట్టిన హ‌త్యా రాజ‌కీయాలు ఇప్ప‌టికీ వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌కర్త‌ల‌ను చంపుకు తింటున్నాడు. నాటి హోంమంత్రి మాధ‌వ‌రెడ్డి చ‌నిపోయిన‌ప్పుడు అన్ని వేళ్లూ చంద్ర‌బాబునే వైపే చూపించాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ దాష్టీకాల‌పై పాట‌లు పాడి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తుంద‌న్న కార‌ణంతో బెల్లి ల‌లిత అనే సామాజిక ఉద్య‌మకారిణిని చంద్ర‌బాబే అత్యంత కిరాత‌కంగా ముక్క‌లుముక్క‌లుగా నరికి చంపించాడ‌ని అపవాదు మూట‌క‌ట్టుకున్నాడు. వంగ‌వీటి రంగా, పింగ‌ళి ద‌శ‌రథ‌రామ్ హ‌త్య‌ల్లోనూ చంద్ర‌బాబు పేరే  ప్ర‌ముఖంగా వినిపించింది. 

రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ వెనుక చంద్ర‌బాబు 
చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా రాయ‌ల‌సీమ ప్రాంతం నిత్యం ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌తో అట్టుడుకుతూ ఉండేది. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గానే రాయ‌ల‌సీమ‌లో 14 మంది నాయ‌కుల హ‌త్య‌లు జ‌రిగాయి. ఇవ‌న్నీ చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలకు ప‌రాకాష్ట‌. వైయ‌స్ రాజారెడ్డి గారిని చంపిన నిందితుల‌కు చంద్ర‌బాబు ఆశ్ర‌యం క‌ల్పించిందే కాకుండా వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌టం సిగ్గుచేటు. ఇప్ప‌టికీ వైయ‌స్ రాజారారెడ్డి హ‌త్య కేసుల్లో నిందితుడిగా ఉన్న పార్థ‌సార‌థిరెడ్డిని, వివేకానంద‌రెడ్డిని పొడిచి చంపాన‌ని ఒప్పుకున్న ద‌స్త‌గిరిని ఎల్లో మీడియా ఛానెళ్లు చ‌ర్చ‌ల‌కు పిలిచి పెద్ద పీట వేయ‌డం దుర్మార్గం. ప‌రిటాల ర‌విని త‌న ప్ర‌త్య‌ర్థులు చంపితే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద నింద‌లు వేసిన దుర్మార్గుడు చంద్ర‌బాబు. చంద్రబాబు ఆరోప‌ణ‌ల‌ను నివృత్తి చేయ‌డానికి సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన గొప్ప ధైర్య‌మున్న నాయ‌కుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు. ఇప్పుడు అదే ధైర్యం, నేర్పుతోనే వైయ‌స్ జ‌గ‌న్ గారు రాజ‌కీయాలు చేస్తున్నారు. అసెంబ్లీకి ఎలా వ‌స్తావో చూస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పిన మూడు రోజుల‌కే వైయ‌స్సార్ గారు హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డం వెనుక కూడా అంద‌రూ చంద్ర‌బాబునే అనుమానిస్తున్నారు. ఆ మ‌హ‌నేత మ‌ర‌ణం వెనుక ఇప్ప‌టికీ ఎన్నో స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌లు అలాగే ఉన్నాయి. అన్ని కుట్ర‌ల‌కు కేంద్ర బిందువు చంద్ర‌బాబు.

పాల‌నా వైఫ‌ల్యాలు చ‌ర్చ‌కు రాకుండా..
80 ప‌దుల వ‌య‌సుకు వ‌స్తున్న చంద్ర‌బాబు ఇప్ప‌టికీ అవే క్షుద్ర రాజ‌కీయ‌లు చేస్తున్నాడు. చివ‌రి రోజుల్లో నాలుగు మంచి ప‌నులు చేసి ప్ర‌జ‌ల హృద‌యాల్లో మంచి పేరు తెచ్చుకుందామ‌న్న ఆలోచ‌న చేయ‌డం లేదు. త‌న క్షుద్ర రాజ‌కీయాల‌కు నారా లోకేష్ ని వార‌సుడిగా చేస్తున్నాడు. లోకేష్ ని ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి తొక్క‌ని అడ్డదారులు లేవు. ఎన్టీఆర్ మ‌ర‌ణం ద‌గ్గ‌ర నుంచి నేటి వ‌ర‌కు చంద్ర‌బాబు రాజ‌కీయ‌ జీవితంలో చేసిన ఘోరాల‌పై సీబీఐ విచారణ చేయిస్తే ఖచ్చితంగా వెయ్యేళ్లు శిక్ష పడుతుంది. పాల‌న చేయ‌డం చేత‌కాక వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లు నాయ‌కుల‌ను అక్ర‌మ కేసుల‌తో వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. త‌న పాల‌న వైఫ‌ల్యాలు చ‌ర్చ‌కు రాకుండా రాష్ట్రంలో హ‌త్యా రాజ‌కీయాల‌ను చంద్ర‌బాబు ప్రోత్స‌హిస్తున్నాడు. వైయ‌స్సార్ కుటుంబం మీద పడి చంద్ర‌బాబు ఏడ‌వ‌ని రోజు లేదు. వైయ‌స్ ష‌ర్మిలను దారికి తెచ్చుకున్నాన‌ని చంద్ర‌బాబు సంబ‌ర ప‌డుతున్నాడు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉండి నిత్యం తానే ప్ర‌జ‌ల్లో అశాంతికి కార‌ణ‌మ‌వుతున్నాడు. కొన్నాళ్లు ల‌డ్డూ పేరుతో వికృత రాజ‌కీయం న‌డిపాడు. అక్ర‌మ మ‌ద్యం కేసుల‌తో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల‌ను వేధించాడు. వైయ‌స్ జ‌గ‌న్ గారికి వివేకానంద రెడ్డి హ‌త్య‌తో సంబంధం లేద‌ని సీబీఐ చార్జిషీట్‌తో తేలినా విచార‌ణ అవ‌స‌రం లేదని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసినా ఇప్ప‌టికీ రాజ‌కీయ ల‌బ్ధి పొందడానికి వైయ‌స్ఆర్‌సీపీని ఉద్దేశించి గొడ్డ‌లి పార్టీ అంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూనే ఉన్నాడు. చంద్ర‌బాబు పాపాల‌కు మూల్యం చెల్లించుకునే రోజులు త్వ‌ర‌లోనే రాబోతున్నాయనేది త‌థ్యం. 

నిత్యం జ‌గ‌న్ గారి వ్య‌క్తిత్వ హ‌న‌నం 

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం సంతోషంగా ఉండేవారు. మ‌త్తు డాక్ట‌ర్ సుధాక‌ర్‌ని ప్ర‌లోభ పెట్టి రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకున్న‌దే కాకుండా చివ‌రికి ఆయ‌న మ‌ర‌ణానికి చంద్ర‌బాబు కార‌కుడ‌య్యాడు. చంద్ర‌బాబు లాంటి మ‌నిషి స‌మాజానికి ప్ర‌మాద‌కరం. హ‌త్యా రాజ‌కీయాలు, అవినీతికి నిల‌యం తెలుగుదేశం పార్టీ. చంద్ర‌బాబుకి ద‌మ్ముంటే త‌న బామ్మ‌ర్ది నంద‌మూరి బాల‌కృష్ణ ఇంట్లో జ‌రిగిన కాల్పుల‌పై మాట్లాడాలి. ఇంట్లో గ‌న్ క‌ల్చ‌ర్ పెట్టుకుని వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద నిందలు వేయ‌డం సిగ్గుచేటు. ప్ర‌జాక్షేత్రంలో జ‌గ‌న్ గారిని నేరుగా ఎదుర్కోనే స‌త్తా లేక ఆయ‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డం కోసం నిత్యం పిచ్చి పిచ్చి మాట‌లు, విమ‌ర్శ‌ల‌తో ఆయ‌న వ్య‌క్తిత్వ హ‌న‌నానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే చంద్ర‌బాబు లాంటి వ్య‌క్తిని రాజ‌కీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌జ‌ల‌పైనే ఉందని నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి స్ప‌ష్టం చేశారు.

Back to Top