విశాఖ: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు పోలీసులు 18 నిబంధనలతో ఆంక్షలు విధించారని అనకాపల్లి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తప్పుపట్టారు. వైయస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. `వైయస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాం. వైయస్ జగన్ పర్యటనకు పోలీసులను అనుమతి అడగలేదు. కేవలం వైయస్ జగన్ కు భద్రత కల్పించమని అడిగాం. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాం. మేము ఇచ్చిన రూట్ మార్చి పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు వైయస్ జగన్ ను కవలకూడదు అని రూట్ మార్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతోమంది కార్మికులు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైయస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైయస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో వైయస్ జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు` అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనల్లో ఎంతో మంది చనిపోయారు చంద్రబాబు పర్యటనలో ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారని చెప్పారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో ప్రజలు చనిపోయారని తెలిపారు. వాటిని పోలీసులు ఎందుకు లేఖలో ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారని, వైయస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు సరికాదన్నారు. ఈ విషయంలో పోలీసులు పునరాలోచన చేయాలని కోరారు. ఏ రోజు మేము వైయస్ జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదన్నారు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెబుతున్నారని ఆక్షేపించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. వైయస్ జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కాం ను డైవర్ట్ చేయడం కోసం వైయస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నిన్నటి వరకు వైయస్ జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారని, ఇవాళ రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెబుతున్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో నెలకు రూ.1000 కోట్లు కూటమి నేతలు సంపాదిస్తున్నారని, 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టిడిపి నేతలే చెబుతున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.