పలాసలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త అక్రమ అరెస్ట్ 

కాశీబుగ్గ పోలీసులు ఓవ‌రాక్ష‌న్‌
 
స్టేషన్ ముందు బైఠాయించిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లు మీడియా ప్రతినిధులు. 

శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. కల్తీ మద్యంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం పలాస–కాశీబుగ్గలో మాజీ మంత్రి,వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ డాక్టర్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు హాజరు కావడంతో అధికార నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ నిరసనలో వేణుగోపాల్‌ రెడ్డి అనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త.. మహిళా పోలీసును తోసేశారంటూ ఓ పస లేని ఆరోపణను తెరపైకి తెచ్చారు. మంగళవారం సాయంత్రం టౌన్‌ సీఐ సూర్యనారాయణ.. వేణుగోపాల్‌ రెడ్డిని స్టేషన్‌కు పిలవడంతో వాతావరణం వేడెక్కింది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు స్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ అప్పలరాజు స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. ఇంతలోనే వేణుని సెల్‌లో బంధించారు. వేణుగోపాల్‌పై ఎవరు ఫిర్యాదు చేశారు? ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయన్నది పోలీసులు బహిర్గతం చేయడం లేదు. వేణుపై మహిళా పోలీసు ఫిర్యాదు చేయలేదని, ఆమైపె పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు కోసం ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

 పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు..

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్‌కు వస్తారని పోలీసులు ముందుగానే ఊహించారు. దీంతో కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌తో పాటు పక్కనే ఉన్న టెక్కలి సబ్‌ డివిజన్‌కు సంబంధించిన ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బందిని కూడా కాశీబుగ్గ టౌన్‌ స్టేషన్‌లో మోహరించారు. అవసరమైతే లాఠీచార్జి చేయాలని ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా టౌన్‌ స్టేషన్‌ బయట ఉంటూ, ఎప్పటికప్పుడు స్థానిక అధికార పార్టీ నాయకులకు పరిస్థితిని చేరవేశారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

సీదిరి ఆందోళన..

పార్టీ కార్యకర్త వేణును పోలీసులు టౌన్‌ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ అప్పలరాజు మంగళవారం రాత్రి తన అనుచరులతో ఠాణాకు వెళ్లారు. ఎందుకు వేణుగోపాల్‌ రెడ్డిని నిర్బంధించారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టెక్కలి డీఎస్పీ, కాశీబుగ్గ ఇన్‌చార్జి డీఎస్పీ లక్ష్మణరావు అప్పలరాజుతో మాట్లాడారు. మహిళా పోలీసును నెట్టడంపైనే కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును చూపించాలని మాజీ మంత్రి కోరడంతో పోలీసులు నీళ్లు నమిలారు. ఫిర్యాదు లేకుండా తమ కార్యకర్తను అదుపులోకి ఎందుకు తీసుకున్నారో తమకు తెలుసునని, వీటన్నిటికీ పోలీసులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అప్పలరాజు హెచ్చరించారు.

మహిళా కార్యకర్తలను నెట్టారు

కల్తీ మద్యంపై పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పలువురు మహిళా కార్యకర్తలను కాశీబుగ్గ టౌన్‌ సీఐ సూర్యనారాయణ, పలువురు పోలీస్‌ సిబ్బంది ఇష్టారీతిన నెట్టి, తాకరానిచోట తాకారని, వారి పైన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని మాజీ మంత్రి అప్పలరాజు డిమాండ్‌ చేశారు. చేయని తప్పును సృష్టించి తమ పార్టీ కార్యకర్తపై అక్రమ కేసు బనాయించడం తగదన్నారు. వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలను టౌన్‌ సీఐ సూర్యనారాయణ నెట్టి వేస్తున్న దృశ్యాలను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న వేణుగోపాల్‌ను విడిచిపెట్టాలని కోరారు. అయినా పోలీసులు వదలలేదు.

స్టేషన్‌ ఎదుట బైఠాయింపు

పోలీసుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. తమ కార్యకర్తను విడిచి పెట్టేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని నిరసనకు దిగారు. రాత్రి 12 గంటలు దాటినా నిరసన కొనసాగించారు.

మీడియాకు నో ఎంట్రీ

స్టేషన్‌ వద్ద గొడవ జరుగుతోందని మీడియా ప్రతినిధులు స్టేషన్‌లోనికి వచ్చేందుకు ప్రయత్నించగా టౌన్‌ సీఐ సూర్యనారాయణ తన ప్రతాపం చూపారు. మీడియా ప్రతినిధులు స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులంతా కాశీబుగ్గ టౌన్‌ స్టేషన్‌ ఆవరణలో ధర్నాకు దిగారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను సీఐ సూర్యనారాయణ స్టేషన్‌లోకి అనుమతించకపోగా, దుర్భాషలాడటం తగదని వాపోయారు.

Back to Top