తాడేపల్లి: పార్టీ అనుబంధ విభాగాలన్నీ పార్టీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్ధాగత నిర్మాణంపై వైయస్ జగన్ గారి ఆలోచనలు, బ్లూప్రింట్ను సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలపై చర్చించారు. వైయస్ జగన్ పాలనలో డెలివరీ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లను ఏర్పాటు చేసి సంక్షేమాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకెళితే చంద్రబాబుది రివర్స్ పాలన అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి, మనమంతా సంఘటితంగా పనిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణానికి సంబంధించి మన నాయకుడు వైయస్ జగన్ గారి ఆలోచనలు, ఇప్పటికే సిద్దమైన బ్లూప్రింట్ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై మనం ఏ విధమైన కార్యచరణతో ముందుకెళ్ళాలని వరుసగా సమవేశాలు ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి, ఈ దుర్మార్గాలను ఆపగలగాలి, ఇందులో భాగంగా మనం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ దీనిపై చిత్తశుద్దిగా పనిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ప్రధానంగా అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండాలని వైయస్ జగన్ ఆలోచించి అందుకు అనుగుణంగా స్ట్రక్చర్ నిర్మించారు. క్షేత్రస్ధాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్డ్గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. పార్టీ లైన్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర. మన సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు వైయస్ జగన్ గారు, మనం ఎక్కడా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు, మన పార్టీకి కోట్లాది మంది సైన్యం సిద్దంగా ఉంది, అందరినీ సంఘటితం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నాం. మనం ఇప్పటికే మండల స్ధాయి కమిటీలలో ఉన్నాం, ఇక గ్రామస్ధాయికి వెళ్ళబోతున్నాం, డేటా ప్రొఫైలింగ్ చేస్తూ ముందుకెళుతున్నాం. దీనిపై అందరూ సీరియస్గా దృష్టిపెట్టాలి. వైయస్ఆర్సీపీ అంటే 18 నుంచి 20 లక్షల క్రియాశీల క్షేత్రస్ధాయి నాయకత్వం ఉంటుంది. వీరందరి డేటా ప్రొఫైలింగ్ను మనం సరిగా నమోదు చేయగలిగినప్పుడే మనం అనుకున్న ఫలితాలను అందుకోగలుగుతాం. అందుకు అందరూ సిద్దంగా ఉండాలి, ఈ ప్రక్రియకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్ను మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి. అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాలి. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణంలో అలసత్వం వద్దు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి వారికి కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలి. ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది, జగన్ గారి హయాంలో డెలివరీ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చక్కగా ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తే చంద్రబాబు మాత్రం రివర్స్ పాలన సాగిస్తున్నారు. గతంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చక్కగా చేశాం. ఇప్పుడు జరుగుతున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేద్దాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.