నెల్లూరు: మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని, ఉద్దేశపూరితంగానే పోలీస్ అధికారులను బదిలీ చేసిందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు హింసను ప్రేరేపించే విధంగా ప్రవర్తించారని, వైయస్ఆర్ సీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ని భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. నెల్లూరులో మంత్రి కాకాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని తమ అభిప్రాయమన్నారు. నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని, ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల నిధులు దుర్వినియోగం, వైఫల్యంపై జిల్లా ఎన్నికల అధికారి (జిల్లా కలెక్టర్)పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే.. దాని మీద వీడియో క్లిప్పింగ్, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా జిల్లా ఎన్నికల అధికారి పట్టించుకోలేదన్నారు. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తానని మంత్రి కాకాణి హెచ్చరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు పంచారని సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు FIR నమోదు చేశారని, జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణితో పనిచేశారు అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ కావాలా.. అని ప్రశ్నించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం తమకు లేదని, కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు.