తాడేపల్లి: చంద్రబాబు నిర్వాకం వల్లే ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, ప్రతిపక్షం పనిగట్టుకొని ఫెయిడ్ ఆర్టిస్టులతో విష ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందెవరని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఏపీని చంద్రబాబు అవినీతి రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. విద్యుత్ను అధిక ధరలకు ఎందుకు కొనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. మాజీ స్పీకర్ కొడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబు వేధింపులే కారణమన్నారు. ఫెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు డ్రామాలాడిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉండగా గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా లక్ష ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. అలాంటి వ్యక్తికి సచివాలయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. బీజేపీకి చంద్రబాబు ప్రేమ సందేశాలు పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని ఏ పార్టీలో విలీనం చేస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. Read Also: అడ్వాన్స్ రోబో టెక్నాలజీ కోర్సులు అందించడమే సీఎం లక్ష్యం