వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియాపై కుట్రలు 

అందుకే మార్ఫింగ్‌ ఫోటో అంటూ సీఐడీకి ఫిర్యాదు

కారుమూరు వెంకట్‌రెడ్డి ఆక్షేపణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి.

కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా

హెరిటేజ్‌ మెడకు చుట్టుకున్న నెయ్యి వ్యవహారం

రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలో దారుణ పరిస్థితి

పట్టించుకోని ప్రభుత్వం. సహాయం, నివారణ శూన్యం

అన్నింటినీ వెలుగులోకి తెస్తున్న వైయస్సార్‌పీపీ

దీంతో మరోసారి డైవర్షన్‌కు ప్రభుత్వం కుట్ర

వైయ‌స్ఆర్‌సీపీసోషల్‌ మీడియాపై కక్ష. సీఐడీకి ఫిర్యాదు

కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టీకరణ

తిరుమల లడ్డూ పేరుతో టీడీపీ ఏఐ వీడియో

సాక్షాత్తూ దేవదేవుణ్ని కించపర్చేలా ఆ వీడియో

అందుకు టీడీపీ సోషల్‌ మీడియాపై కేసు పెట్టాలి

ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి: కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా వంటి వరుస ఘటనల సాక్షిగా చంద్రబాబు కుట్రలు, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోవడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఎవరో పెట్టిన పోస్టును తీసుకొచ్చి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబును మార్ఫింగ్‌ ఫొటోలతో కించపర్చారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. నిజానికి మార్ఫింగ్‌ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో వేల మంది సైకోలకు జీతాలిచ్చి  ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.
    తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ఆయన మెడకే చుట్టుకుందని, ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కు చంద్రబాబు టీటీడీ నిధులు దోచిపెట్టిన వైనం ఆధారాలతో సహా బయటకొచ్చిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా.. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీసోషల్‌ మీడియాను నిలువరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి వాటికి ఏ మాత్రం భయపడే ప్రసక్తి లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగంగానే..:
    కూటమి పాలనలో పంపిణీ అవుతున్న కల్తీ పాలు, కలుషిత నీరు తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుస ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి పేరుతో చంద్రబాబు ఆడిన రాజకీయ డ్రామాలు హెరిటేజ్‌ ముంగిట్లోకి వచ్చి ఆగింది. ఈ వరుస ఘటనలతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇరుకున పడింది. తమ తప్పులకు సమాధానం చెప్పుకోలేక వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసే డైవర్షన్‌ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెర లేపింది.
    ఆ దిశలోనే వర్ల రామయ్య నేతృత్వంలో కొందరు టీడీపీ నాయకులు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను కలిసి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు గురించి అసభ్యకర పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎవరో పెట్టిన పోస్టులను తీసుకొచ్చి వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించి సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్‌గారు చేయించారంటూ కట్టుకథలు అల్లుతున్నారు. 

వ్యక్తిత్వ హనన కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు:
    ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కూటమి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటిది వాళ్ల గురించి మార్ఫింగ్‌లు, డీప్‌ ఫేక్‌ ఫొటోలతో పోస్టులు పెట్టాల్సిన అవసరం మాకులేదు. అసెంబ్లీలో, బయటా మహిళలతో కూటమి ఎమ్మెల్యేలు అసభ్యంగా, అశ్లీలంగా వ్యవహరిస్తున్నారు. మహిళలకు అర్థరాత్రి వీడియో కాల్స్‌ చేసి వేధిస్తూ దొరికిపోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూటమి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటిది వీరి గురించి ప్రత్యేకంగా మేం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు. రెండు పత్రికలు, నాలుగు టీవీలు, వందలాది యూట్యూబ్‌ ఛానళ్లు, లక్షల్లో మీమ్‌ పేజీలతో నిత్యం తమకు గిట్టని వారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని హైదరాబాద్‌ నుంచి నడిపిస్తున్నది చంద్రబాబే. ప్రజల నుంచి దోచుకున్న సంపదను ఐటీడీపీ పేరుతో ఆఫీస్‌ ఏర్పాటు చేసి వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నదీ చంద్రబాబే. 

లడ్డూపై చేసిన ఏఐ వీడియోకి కేసు పెట్టాలి:
    ఆఖరుకి దేవదేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు, చేపల నూనె కలిసిందని చంద్రబాబు ప్రచారం చేశాడు. అదంతా అబద్ధమని సీబీఐ సిట్‌ తేల్చినప్పుడు ప్రజలకు క్షమాపణలు చెప్పి అంతటితో వివాదానికి ముగింపు పలకాల్సింది పోయి, బాత్రూమ్‌లు కడిగే రసాయనాలు కలిశాయని ఇంకా ఉన్నాదిలా మారి ప్రచారం చేశాడు. వైయ‌స్ఆర్‌సీపీ మీద దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పవిత్రమైన తిరుమల లడ్డూకి కళ్లు, నోరు, నామాలు పెట్టి ఏఐ వీడియోలు చేసి తెలుగుదేశం అధికార సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. అలా తిరుమల పవిత్రతను, కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఇంతకన్నా అపచారం, మార్ఫింగ్‌ ఇంకోటి ఉంటుందా?.

హెరిటేజ్‌ అవినీతిపై సమాధానం చెప్పే దమ్ము లేదు:
    చంద్రబాబు, లోకేష్‌ అవినీతి బాగోతం గురించి రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ డెయిరీకి టీటీడీ నిధులు దోచిపెట్టడం, ఆ దోపిడీనికి అమలు చేయడంలో భాగంగా కల్తీ నెయ్యి పేరుతో సాగించిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చివరకు చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు. హెరిటేజ్‌ అవినీతిని జగన్‌గారు ఆధారాలతో సహా, బయటపెడితే దానికి సమాధానం చెప్పే దమ్ము కూటమి నాయకులకు లేదు. అందుకే నైతికంగా ఇంకా దిగజారి ఇలాంటి డైవర్షన్‌ డ్రామాలు మొదలు పెట్టారని కారుమూరు వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top