తాడేపల్లి: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.