అధికారంతో అందలం ఎక్కగానే అహంకారంతో మాట్లాడే ముఖ్యమంత్రిని గత ప్రభుత్వంలో చూసాం. ప్రజలకు నేను సేవకుడిని అన్న పాలకుడిని ఇప్పుడే చూస్తున్నాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మన పార్టీ కాని వాళ్లకు పన్లు చేయను అన్న చంద్రబాబు ఎక్కడ మనకు ఓటేయని ప్రజలకు కూడా మంచి చేయాలి అన్న వైఎస్ జగన్ ఎక్కడ? రుణమాఫీ కాలేదని అడిగినందుకు రైతులపై విరుచుకుపడ్డ చంద్రబాబు పాలనకు, ప్రజల సమస్యలను తీర్చడమే అజెండా అని ప్రకటించిన జగన్ పరిపాలనకూ మధ్య ఎంత తేడా? మన పార్టీ కాని వారు కూడా మనకి ఓటేయలని అనుకునేలా ప్రభుత్వం మంచి పనులు చేయాలి అంటారు నేటి ముఖ్యమంత్రి. నాకు ఓట్లేయకపోతే నేనేసిన రోడ్ల మీద నడవకండి, నేనిచ్చే పింఛన్లు తీసుకోకండి అన్నాడు నాటి ముఖ్యమంత్రి. ఈ గవర్నెన్స్, గ్రీవెన్స్ అంటూ టెక్నాలజీ తప్ప ప్రజా సమస్యలకు పరిష్కారం చూపలేదు టీడీపీ ప్రభుత్వం. పింఛను కావాలన్నా అధికారులు కాని జన్మభూమి కమిటీల వద్ద చేతులు కట్టుకుని ఎదురుచూడవలసి వచ్చేది. ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు, గవర్నమెంటే ప్రతి ఇంటి ముందూ ఉండాలి అని ఆదేశించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందేలా లక్షలాది మంది యువతను గ్రామ సచివాలయానికి అనుబంధం చేస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో ప్రజల సొమ్ముతో అక్రమ కట్టడాలు కట్టాడు చంద్రబాబు. ప్రభుత్వాలైనా సరే అక్రమ కట్టడాలతో పర్యావరణానికి ముప్పు తేవడానికి వీల్లేదు అని ఆదేశించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాంట్రాక్టు ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలిచ్చి చాకిరీ చేయించుకుని, ఉద్యోగ భద్రత ఇవ్వకుండా బెదిరించిన సర్కార్ ఒకప్పుడు ఉంటే... చిరు ఉద్యోగులను సంతోషంగా ఉండేలా చేయడం ద్వారానే ప్రభుత్వానికి ప్రజలకూ మధ్య సరైన అవగాహన ఏర్పరచలగలం అని భావించే ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ప్రాజెక్టులు, పథకాలు, జీవోలు, అధికారులతో సమావేశాలు, నిర్ణయాలు, ఆచరణలు ఏవైనా ఈ ప్రభుత్వం పారదర్శకంగానే చేస్తుందని నిర్మొహమాటంగా చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలకు సేవకులుగా పని చేస్తాం తప్ప పాలకులమని అజమాయిషీ చెలాయించము అని స్పష్టం చేసిన యువనాయకుడిని చూసి ఆంధ్రావని మురిసిపోతోంది.