రైతు కన్నీటి వరదలో కొట్టుకుపోతారు

కర్నూలు:

అందరికీ అన్నం పెట్టే రైతు ఇప్పుడు తనను ఆదుకునే వారికోసం ఎదురుచూస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత ఏలుబడిలో అన్నదాత ఆనందంగా ఉన్నాడని చెప్పారు. ఇప్పుడే రైతన్నను కదిలించినా కష్టాలు.. కన్నీళ్లే కనిపిస్తున్నాయని విచారం వ్యక్తంచేశారు.  కొందరు రైతులైతే పంట చేలు అమ్ముకొని అప్పులు కట్టడమో, లేకుంటే ఆత్మహత్యలు చేసుకోవడమో తమ ముందున్న మార్గమని చెబుతున్నారన్నారు. అన్నదాతల సమస్యలు ఈ పాలకులకు పట్టదు.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే పట్టదన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ రైతన్న కన్నీళ్లలో కొట్టుకుపోతాయనీ, ఇది తథ్యమనీ స్పష్టంచేశారు.  మరో ప్రజాప్రస్థానంలో భాగంగా మంగళవారం 34వ రోజు షర్మిల పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు, పాణ్యం నియోజకవర్గంలో సాగింది.
గోడు వెళ్ళబోసుకున్న రైతులు
     పర్ల గ్రామ శివారులో రైతులు షర్మిలను కలిసి గోడువెళ్లబోసుకున్నారు. దీంతో రైతును పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలపై షర్మిల మండిపడ్డారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని.. ఆ రాజ్యంలో రైతన్న రాజులా ఉంటాడని భరోసా ఇస్తూ ముందుకుసాగారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని అవిశ్వాసంపెట్టి దింపేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలాడుతున్నారని దుయ్య బట్టారు.  34 రోజులలో షర్మిల మొత్తం 451 కిలోమీటర్లు నడిచారు.

     షర్మిల వెంట నేతలు..: మరో ప్రజాప్రస్థానం కర్నూలు జిల్లాకు వచ్చి మంగళవారంతో 13 రోజులైంది. షర్మిల వెంట ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి 13 రోజులుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. మంగళవారం షర్మిలతో కలిసి దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రాజేష్, బాలరాజు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, సాయి ప్రసాద్‌రెడ్డి, మనోహర్, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణి రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేస్తున్న నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి తదితరులు షర్మిలతో కలిసి ముందుకు సాగారు.

Back to Top