రాజకీయ వ్యాపారి చంద్రబాబు

పోరాటం కాదు మైలేజీ అరాటం
ఇంత వరకూ ప్రత్యేక హోదా పేరెత్తని బాబు
కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాలు
రాజకీయ లబ్ది తప్ప రాష్ట్రం గురించి చింతలేదు
అవకాశవాదమే బాబు రాజకీయం

బిజినెస్ మెన్ బాబు ఎప్పుడూ తన లాభం మాత్రమే ఆలోచించుకుని పొలిటికల్ డీల్స్ చేస్తుంటారు. ప్రత్యేక హోదా విషయంలోనూ బాబు వైఖరి అలాగే ఉంది. రాష్ట్రానికి సిఇవోగా పని చేస్తా అని బాబు గొప్పగా చెప్పుకుంటారు కూడా. వ్యాపారంలో స్వలాభం కోసం వ్యాపారులు అనుసరించే స్వార్థపూరిత విధానాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుసరిస్తుంటారు. ఏ పని చేయాలన్నా అందులో తనకు లాభం ఏముంటుంది అని ఆలోచిస్తారు. పండగలను కూడా తన పబ్లిసిటీకి వాడుకోవడం, ప్రముఖులతో పరిచయాలను ప్రచారం చేసుకోవడం, ఏ సందర్భాన్నైనా రాజకీయ అవకాశంగా మలుచుకోవడం ఇవన్నీ బిజినెస్ మెన్ బాబు లక్షణాలు. ఇప్పుడు తన అవకాశవాద రాజకీయాల కోసం తాను తిట్టిన కాంగ్రెస్ తోనే మంతనాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలోనూ కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం చేసుకుని సభనుంచి పారిపోయాడు చంద్రబాబు. ఎఫ్.డీ.ఐ బిల్లు ఓటింగ్ జరుగుతున్నప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు సభకు హాజరు కాకుండా కుమ్మక్కు రాజకీయాలు చేసాడు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా, కాంగ్రెస్ కు నష్టం కలక్కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడూ అదే ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. హోదా కోసం కేంద్రంపై పెట్టిన అవిశ్వాసంలోనూ తన చీకటి రాజకీయాన్ని నిస్సిగ్గుగా నడిపిస్తున్నాడు. 

ప్రత్యేక హోదా తోనూ రాజకీయ వ్యాపారం

కోట్లాది మంది ఆంధ్రుల ఆశ ప్రత్యేక హోదా. రాష్ట్రానికి న్యాయపరంగా, చట్టపరంగా దక్కాల్సిన స్టేటస్ ప్రత్యేక హోదా. కానీ కేవలం చంద్రబాబు వ్యాపారసూత్రాల వల్లే హోదాని కేంద్రం కాళ్లకింద తొక్కిపెట్టి ఉంచింది. అన్ని సందర్భాల్లోనూ కేంద్రానికి అండగా నిలిచానని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ విషయంలోనూ మోదీ సర్కారుకు అండగా నిలిచామంటూ బాబు ఇప్పుడు కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంత మద్దతును అందుకున్న రాష్ట్రానికి హామీగా ఇచ్చిన హోదాను ఎందుకు ఇవ్వలేదు. ఇన్నిసార్లు కేంద్రాన్ని సమర్థించాము గనక రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చమని బాబు ఎందుకు గట్టిగా అడగలేకపోయాడు. మోదీ సర్కారును వెనకేసుకొచ్చినా కూడా బాబుకు ప్రధాని అప్పాయింట్ మెంట్ ఎందుకు దొరకలేదు. ఎందుకంటే బాబు అక్రమాలు, అవినీతి భాగోతాల గుట్టంతా కేంద్రం గుప్పిట్లో ఉంది కనుక. హోదా ఇవ్వకపోయినా, విభజన హామీలు నెరవేర్చపోయినా కిమ్మనగలిగే ధైర్యం బాబులో ఇన్నాళ్లూ లేకపోవడానికి కారణం కేంద్రంతో వైరం పెట్టుకోవడం వీలు కాకనే. తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి బాబు కేంద్రంతో చేసిన లావాదేవీలే రాష్ట్రానికి నేడీగతి పట్టించాయి. దిల్లీ కి ఎప్పుడు వెళ్లినా అసెంబ్లీ స్థానాల పెంపు గురించే బాబు అడిగేవాడని మిత్ర పక్ష బిజెపి మంత్రులే బాహాటంగా  చెప్పారు. ఈ విషయాన్ని బాబు కూడా తన అక్కసులో భాగంగా వెళ్లగక్కాడు కూడా. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెంచమని ఎన్నిసార్లు అడిగినా మోదీ పట్టించుకోలేదని అసెంబ్లీలో తన ఉక్రోషాన్ని బైటపెట్టాడు. తన లొసుగులు బైట పడకుండా ఉండేందుకు కేంద్రానికి హోదాని తాకట్టు పెట్టేసిన బేహారి చంద్రబాబు. 

అవిశ్వాసంలోనూ అవిశ్వాసమే..

వ్యాపారంలో కొందరు మోసకారులూ ఉంటారు. బాబూ అచ్చంగా ఆ టైపే. భాగస్వామిని ముంచి పోయే మోసగాళ్లలాగే చంద్రబాబు కూడా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేక హోదా పై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న ఎన్డీయే పై అవిశ్వాసాన్ని పెడితే, చేతులు కలుపుతామని చెప్పి, అంతలోనే మాట మార్చాడు బాబు. సొంతంగా అవిశ్వాసం అంటూ గందరగోళాన్ని సృష్టించాడు. సభలో అవిశ్వాసానికి మద్దతు కూడగట్టడంలోనూ తీవ్ర అలక్ష్యాన్ని చూపించాడు. అంటే ప్రజల ముందు హోదా కోసం పోరాడుతున్నట్టు నటిస్తూ, కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నామని ప్రకటిస్తూ, అవిశ్వాసంపై చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం బాబుకే చెల్లింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కనుక కేంద్రపై అవిశ్వాసానికి పూనుకోకపోతే టిడిపి అధినేత ఎప్పటకీ ఆ ఊసే ఎత్తేవారు కాదు. 

నేటికీ బాబు నోట వినిపించని హోదా మాట

గత కొన్నాళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లి హోదా ఆకాంక్షను సజీవంగా  ఉంచడమే కాదు, హోదా కోసం ఎందాకైనా అంటూ ఇతర పార్టీల మద్దతునూ కూడగడుతోంది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ప్రజలు అనుకుంటారనే భయంతో బాబు తాను కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా అంటూ రంగంలోకి దిగాడు. కానీ ఒక్కసారి కూడా స్పష్టంగా ప్రత్యేక హోదా కావాలి అని మాత్రం తన నోటితో అనలేదు. మిగిలిన రాష్ట్రాలకు హోదా కొనసాగుతోందని, ఆర్థిక సంఘం హోదా వద్దని చెప్పలేదని, కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని అనడమే తప్ప ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే మాట మాత్రం బాబు నోట వినపడనే లేదు. వినబడుతుందన్న నమ్మకమూ లేదు.

అవిశ్వాసం అంటేనే అప్పుడే ఎందుకు అన్న బాబు యూ టర్న్ తీసుకుని అవిశ్వాసానికి సరే అనడం, ముందు వైఎస్సార్ కాంగ్రెస్ కి మద్దతు అని ప్రకటించి మర్నాడే మాటమార్చి సొంతంగా అవిశ్వాసం పెడతామనడం వెనక ఉన్న మతలబు ఒకే ఒక్కటి...మైలేజీ...రాష్ట్ర ప్రయోజనాల కోసం నేనూ పోరాడుతున్నాను అనే మైలేజీ కోసమే బాబు తన మడత కాజాల మాయాజాలం ప్రయోగిస్తున్నాడు. బాబూ పక్కా అవకాశవాద వ్యాపార దృక్పధానికి ఇంతకన్నా రుజువేం కావాలి...? 
Back to Top