జగన్‌ ధాటిని తట్టుకోవడానికే... !


వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే లక్ష్యంతోనే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేశారా! అవుననే అంటోంది సామ్నా సంపాదకీయం.
ముంబై:

కేంద్ర మంత్రిమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద పీట వేయడం వెనుక కారణం.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనడమేనని శివసేన అధినేత బాల్ ఠాక్రే  అభిప్రాయపడ్డారు. సామ్నా దినపత్రిక   సంపాదకీయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. క్యాబినెట్ విస్తరణపై ఠాక్రే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సామ్నాతోపాటు మహారాష్ట్రలోని దాదాపు అన్ని ప్రముఖ మరాఠీ దినపత్రికల సంపాదకీయాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్, తెలంగాణ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి మండలిలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రాధాన్యతనిచ్చారని ఆ పత్రికలు పేర్కొన్నాయి.
    ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని ఠాక్రే తన సంపాదకీయంలో అభిప్రాయపడ్డారు.  జగన్‌ ప్రభావాన్ని తగ్గించడానికి  ఈ అంశాలు ఉపయోగపడకపోవచ్చునని పేర్కొన్నారు.
    ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపునకు చెందిన ‘లోక్‌సత్తా’ దినపత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. వైయస్ మరణానంతరం ఆయన కుమారుడైన జగన్‌కి కాంగ్రెస్ సరైన ఆదరణ ఇవ్వలేదనీ, ఈ కారణంగానే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారనీ వివరించింది. ఆయన్ని ఎదుర్కొనేందుకు దర్యాప్తుల పేరుతో జైలులో కూడా పెట్టించారని పేర్కొంది. మరోవైపు తెలంగాణ అంశంపై కూడా కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోయిందనీ జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ కు క్యాబినెట్‌లో కాంగ్రెస్ పెద్ద పీట వేసిందనీ  లోక్‌సత్తా పత్రిక పేర్కొంది.

Back to Top