బీసీల అభ్యున్నతి వైయస్‌ఆర్‌ ఘనతే

– విద్యా, ఆరోగ్యం, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం
– మహిళల ఆర్థిక ప్రగతికి దారి చూపిన దార్శనికుడు
– తొమ్మిదేళ్లు మాటలతో మభ్యపెట్టిన చంద్రబాబు 

ఆర్భాటంగా మాటలు చెప్పడం.. ఆనక నేనెక్కడన్నానని దబాయించడం బాబుకు అలవాటైంది. చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసానికి గురికాని వర్గమంటూ లేదు. బీసీల సంక్షేమం విషయంలో కానీ.. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కానీ బాబు ‘ట్రాక్‌ రికార్డు’ చూస్తే.. ఆయన మాటలను ఎవరూ విశ్వసించరు. అదే దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఆరేళ్ల పాలనలో బీసీల కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వకుండానే.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, పావలా వడ్డీ పథకం వంటి అనేక సంక్షేమ పథకాలతో వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు బాటలు పరచగా.. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో బీసీలకు తీరని అన్యాయం చేశారు. 

మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు
వైయస్‌ హయాంలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు అందించటం ద్వారా బీసీ మహిళలకు రూ. 1,400 కోట్ల మేర వడ్డీ రాయితీ లభించింది. అంతేకాదు.. బ్యాంకుల నుంచి రూ. 28,000 కోట్ల మేర రుణాలు పొంది వివిధ రకాల వ్యాపారాలు, వ్యవసాయాల్లో పెట్టుబడులుగా పెట్టి సాధికారత సాధించే దిశగా పయనించారు.

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై ఏంచేశారు..?
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించిన చంద్రబాబు ఏనాడూ ఆ అంశంపై ప్రత్యక్ష పోరాటానికి దిగిన సందర్భం లేదు. ఆయన అధికారంలో ఉండగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అయితే ఈ 15 ఏళ్లలో కొన్ని వందలసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏ ఒక్క రోజు కూడా ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడగలేదు. 

బీసీలకు 100 సీట్లు నీటి మూటలే.. 
అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటివేవీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో తాను బీసీలకు 100 సీట్లిస్తానని, పది వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తానని, నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పిస్తానని చంద్రబాబు హామీలు గుప్పించారు. 2009 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన చేతి వృత్తిదారుల సదస్సులో బీసీలకు 100 సీట్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతకుముందు 2008లో వరంగల్‌లో జరిగిన బీసీ గర్జనలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని తీర్మానం చేశారు. ఆ సమావేశంలో 93 కులాల పేర్లు చదివి మరీ తనకు తప్ప బీసీలపై ఎవరికీ పేటెంట్‌ లేదన్నారు. అయితే ఆ ఎన్నికల్లో బీసీలను నట్టేట ముంచి కేవలం 50 సీట్లతో సరిపుచ్చారు. తాను పోటీ చేసే స్థానాలన్నింటికీ ఒకేసారి లేదా రెండుసార్లలో అభ్యర్థులను ప్రకటిస్తే బీసీల లెక్క తేలుతుందనే ఉద్దేశంతో అర్థరాత్రి, అపరాత్రి, 10 మంది, 15 మందిని అభ్యర్థులుగా దఫదఫాలుగా ప్రకటించారు. అదే ఎన్నికల్లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఒకే రోజు 200 మందికి పైగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అందులో 73 మంది బీసీలకు టికెట్లిచ్చారు. 

బీసీల విద్య కోసం.. 
బీసీ విద్యార్థి ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులు చదువుకోగలిగే పరిస్థితి చంద్రబాబు హయాంలో లేదు. కానీ వైయస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విద్యార్థి ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించటానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారు. దానివల్ల ఈ రోజు లక్షలాది మంది  విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయగలిగారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో కనీసం ఒక్క విద్యార్థికైనా ఏ చదువుకూ ఫీజు చెల్లించలేదు. 1995–96లో తాను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో బీసీ హాస్టళ్ల నిర్వహణకు రూ. 43.54 కోట్లు కేటాయించిన చంద్రబాబు.. తాను దిగిపోయే సంవత్సరంలో ఇచ్చింది కేవలం రూ. 100 కోట్లే. అదే వైయస్‌ హయాంలో తొలుత రూ. 106 కోట్లున్న బడ్జెట్‌ ఐదో సంవత్సరానికి రూ. 241 కోట్లకు పెంచారు.

స్కాలర్‌షిప్‌లు 30 మందికే.. 
వైయస్‌ అధికారంలోనికి రాకముందు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకున్న 100 మంది బీసీ విద్యార్థులలో కేవలం 30 మంది వరకు మాత్రమే మంజూరు చేసేవారు. ప్రతిభతో పాటు ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లకు కేటాయించిన బడ్జెట్‌ అయిపోయేంత వరకు ఇచ్చి నిలిపివేసేవారు. ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను నిలిపివేయాలంటూ చంద్రబాబు హయాంలోనే జీవో నం. 90 జారీ చేశారు. అదే వైయస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది బీసీ విద్యార్థులకు శాచ్యురేషన్‌ పద్ధతిన స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్‌ ఫీజు మంజూరయ్యాయి. దాదాపు 40 లక్షల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్‌లాంటి వృత్తివిద్యా కోర్సులను చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నారు.

సంక్షేమ హాస్టళ్లు...
కళాశాల హాస్టళ్ల విషయానికొస్తే 23 జిల్లాల్లో 23 హాస్టళ్లు ఏర్పాటు చేస్తానన్న హామీని చంద్రబాబు నెరవేర్చుకోలేకపోయారు. అదే వైయస్‌ హయాంలో నియోజకవర్గానికి ఒకటి బాలురకు, ఒకటి బాలికలకు చొప్పున దాదాపు 600 హాస్టళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు అందులో 500కు పైగా హాస్టళ్లలో విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. బాబు హయాంలో సంక్షేమ హాస్టళ్లలో పౌష్టికాహారం కల్పించటానికి నిధులు కూడా అవసరమైన మేరకు విడుదల చేయలేదన్న విషయాన్ని ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి’’ అని వారు వివరిస్తున్నారు.

బీసీ మహిళలకు ఆలంబన..
‘‘అలాగే.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో సగౌరంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులు కల్పించాలన్న ఉద్దేశంతో రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. దాదాపు కోటి 20 లక్షల మంది మహిళలకు ఇప్పటి వరకు పావలా వడ్డీ పథకం కింద సుమారు రెండు వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు చెల్లించారు. అందులో దాదాపు 70 లక్షల మంది బీసీ మహిళలు పావలా వడ్డీ కింద దాదాపు గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో 1,400 కోట్ల రూపాయల మేరకు లబ్ధిపొందారు. ఇది కాకుండా బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు దాదాపు రూ. 40 వేల కోట్ల మేర రుణాలు ఇప్పిస్తే.. అందులో 70 శాతం నిధులు బీసీ మహిళలు తీసుకుని వ్యాపారాలు చేయడం, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోగలిగారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఏదో మేలు చేస్తానని చెప్తున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేకపోయారు. 

ఇస్త్రీ పెట్టెలిచ్చి అభివృద్ధి అన్నాడు... 
వెనుకబడిన కులాలు ముఖ్యంగా బీసీ కులాల సామాజికంగా అభివృద్ధి సాధించాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని కేవలం కుల వృత్తి చేసుకునే వర్గాలుగా చూస్తూ చంద్రబాబు హయాంలో ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, మోకులు, మొగతాళ్లు, సైకిళ్లు (అవి కూడా ఏమాత్రం నాణ్యత లేనివన్న విషయం అప్పట్లోనే చెప్పుకున్నారు) ఇచ్చి ఎంతో చేశానని విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీసీ వర్గాల్లో వృద్ధులను ఆదుకోవటానికి వైయస్‌ పెన్షన్లు మంజూరు చేస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో పెన్షనర్లలో ఒకరు చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పెన్షన్‌ ఇచ్చే విధానం అమలులో ఉండేదని వారు గుర్తుచేస్తున్నారు.

బీసీలకు ఇళ్ల నిర్మాణంలోనూ వివక్షే..!
‘‘వైయస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంతృప్త స్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. అత్యధిక లబ్ధిదారులు బీసీలే. వైఎయ హయాంలో మొత్తం 45 లక్షల ఇళ్లు పూర్తి కాగా.. మరో 15 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన 45 లక్షల ఇళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లు బీసీలకు కేటాయించినే. వీటికి బీసీ వర్గాల వారికి రూ. 2,640 కోట్ల మేర సబ్సిడీ రూపంలో అందించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లలోనూ 5 లక్షల ఇళ్లు బీసీలకు చెందినవే. కానీ.. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకంలో బీసీ లబ్ధిదారుల సంఖ్య స్వల్పం. 

నాడు ఆరోగ్య, సంక్షేమ చర్యలేవీ?
చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఎవరు అనారోగ్యం పాలైనా.. ఎవరికి ఏ జబ్బు చేసినా.. వైద్యం కోసం ఆ ఇంట్లో పుస్తెలతాడు, పశువులు, చివరికి పూరిపాకనూ అమ్ముకునే దుస్థితి ఉండేది. పాతికా పరకా భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు చేసి.. చివరకు దానినీ కోల్పోయిన వాళ్లే. వైఎయస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డుతో నేరుగా పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 15.18 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటే.. వీరిలో దాదాపు ఏడు లక్షల మంది పై చిలుకు బీసీ వర్గాల వారు ఉన్నారు. వారి శస్త్రచికిత్సల కోసం వైఎస్‌ హయాంలో రూ. 1,500 కోట్లు వ్యయం చేశారు.
Back to Top