మళ్లీ అదే మోసం

– చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ ఎంపీల  ఓవరాక్షన్‌
– పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర
– నిరవధికంగా వాయిదా వేయించి లబ్ధిపొందే ఆలోచన 
– నాలుగేళ్ల జగన్‌ పోరాటాన్ని నీరుగార్చే వ్యూహం 
– కేంద్రంపై పైచేయి సాధించాల్సిందిపోయి హోదా నిర్వీర్యానికి ఎత్తుగడ 

మళ్లీ మళ్లీ అదే వ్యవహారం. చంద్రబాబు ద్వంద్వ నీతికి ఏపీ ప్రజలు నాలుగేళ్లుగా బలవుతూనే ఉన్నారు. క్షణానికోసారి మాట మార్చే చంద్రబాబు వైఖరి ఏపీకి ఒక పక్క శాపంగా మారితే.. ఆయన్ను సపోర్టు చేస్తున్న ఒక వర్గం మీడియా కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగేళ్లుగా జరుగుతున్న అవినీతిని బయటి ప్రపంచానికి తెలియకుండా మేనేజ్‌ చేస్తూనే ఆయన చేతకానితనాన్ని కప్పిపుచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది బాబు అనుకూల మీడియా. అయితే ఈ విషయాలను ఏపీ ప్రజలు కొంతవరకు సహించవచ్చుగాక.. కానీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను మాత్రం గమనిస్తూనే ఉన్నారు. 

జగన్‌ నాలుగేళ్ల నిర్విరామ పోరాటం... 

 నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ పోరాడుతున్న విషయం ప్రత్యేకించి ఏపీ ప్రజలకు చెప్పనవసరం లేదు. హోదా కోసం వైయస్‌ జగన్‌ చేసిన నిరాహార దీక్షను.. ఆ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన విధానాన్ని జనం చూశారు. విశాఖ వేదికగా వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన జై సమైక్యాంధ్ర సభ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే విశాఖలో ప్రత్యేక హోదా కోసం యువత చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావం ప్రకటించేందుకు విశాఖ వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని రన్‌వేపైనే ప్రభుత్వం నిర్బంధించిన విషయాన్ని.. కొవ్వొత్తుల ర్యాలీని జరగకుండా అడ్డుకున్న విషయాన్ని దేశవ్యాప్తంగా అందరూ చూశారు. 
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై యువభేరిల పేరుతో విద్యార్థులకు వైయస్‌ జగన్‌ అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సజీవంగా నిలిపారు. చిన్నారులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలు ‘హోదా భిక్ష కాదు.. మా హక్కు’ అని నినదించే స్థాయిలో మార్పు తీసుకొచ్చారు. ఆంధ్రాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా అనే పదం వినబడుతుందంటే అది ముమ్మాటికీ జగన్‌ పోరాట ఫలితమే. నాలుగేళ్లు పోరాడి ప్రత్యేక హోదా నినాదాన్ని క్లైమాక్సుకు తీసుకురాగలిగారు. 

ఈ నాలుగేళ్లుగా అన్ని సందర్భాల్లోనూ ప్రత్యేక హోదా కోసం  వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు వెంటరాగా  వైయస్‌ జగన్‌ ఒక్కరే సొంతంగా పోరాడారు. అప్పుడప్పుడూ హోదా గళం వినిపించిన పవన్‌ కల్యాన్‌ ట్విట్టర్‌లో తప్ప జనంలో కనపడింది లేదు. విశాఖ కొవ్వొత్తుల ర్యాలీకి వస్తానని చెప్పిన మనిషి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ప్రతిపక్ష నాయకుడనే గౌరవం కూడా లేకుండా వైయస్‌ జగన్‌ను రన్‌ వేపైనే నిర్బంధించినా ఎక్కడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందీ లేదు.  ఇటీవల వామపక్షాలు నిర్వహించిన బంద్‌కు కూడా వైయస్‌ఆర్‌సీపీ మద్ధతు ప్రకటించింది. కొన్ని ప్రజా సంఘాలు కూడా ఆయా నిరసనలకు అండగా నిలిచాయి తప్ప టీడీపీ ఎక్కడా బంద్‌ నిర్వహించలేదు. 

మానవహారాలతో  ముందడుగు 

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్‌ జగన్‌ నేతృత్వంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలను నిర్వహించారు. పార్లమెంట్‌లో ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో వారికి అండగా నిలిచేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్ధతును కూడగట్టేందుకు శ్రీకారం చుట్టారు. అవిశ్వాసం వీగిపోయినా లేదా చంద్రబాబు కుట్రలతో చర్చకు రాకపోయినా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు.
 మొన్నటిదాకా ప్యాకేజీని పట్టుకు వేలాడిన చంద్రబాబు తన రాజకీయ అవసరాల దృష్ట్యా ప్రజల ఆలోచనలను, వారిలో వచ్చిన మార్పును గుర్తించి హోదాకు జై అనక తప్పలేదు.హోదా పోరులో ఇక్కడే వైయస్‌ జగన్‌  సగం విజయం సాధించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయించడం, ఎన్‌డీఏలోనే కొనసాగుతామని గింజుకున్నా.. రెండు రోజుల్లోనే మనసు మార్చుకుని వైదొలగడం... ఇవన్నీ జగన్‌ చేసిన ప్రజా ఉద్యమానికి భయపడే అని వంద శాతం ఒప్పుకోకతప్పదు. చివరికి వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్ధతు పలుకుతానని చెప్పిన చంద్రబాబు.. ఆ క్రెడిట్‌ జగన్‌కు రావడం ఇష్టం లేక మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. కారణం ఏదైతేనేం అక్కడా చంద్రబాబుపై,  జగన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. లోకల్‌ మీడియా దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా.. దేశవ్యాప్తంగా వైయస్‌ జగన్‌ పేరు మార్మోగిపోయింది. సీనియర్‌ నాయకులు, పెద్ద పెద్ద పార్టీలు మోడీకి భయపడినా తన వద్దనున్న ఐదుగురు ఎంపీలతోనే ఐదు కోట్ల ప్రజల పక్షాన పోరాడేందుకు పార్లమెంట్‌ వేదికగా పూనుకున్న వైయస్‌ జగన్‌పై ప్రశంసల జల్లు కురిసింది. రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. 

తెలుగు ప్రజల ఆత్మగౌరవం 

చరిత్రలో నిలిచిపోయే కీలక సందర్భంలో హోదాను సాధించి కేంద్రం మెడలు వంచాల్సిన అరుదైన అవకాశాన్ని కాలరాసేందుకు బాబు కుట్రలు చేయడం యావత్‌ తెలుగు ప్రజలను ఆవేదనకు గురిచేసింది. సభలో సంయమనంతో వ్యవహరించి చర్చకు తీసుకురావాల్సిందిపోయి.. టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి సభకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారు. సభను నిరవధికంగా వాయిదా వేసేలా,  అవిశ్వాసంపై ఓటింగ్‌ జరగకుండా చేయాలనేది టీడీపీ ఆలోచన. ఈ సందర్భాన్ని అనుకూలంగా మలుచుకుని నెపాన్ని కేంద్రం మీదకు నెట్టేసి.. తామే పోరాడామని కలరింగ్‌ ఇచ్చుకోవడం టీడీపీ రాజకీయపు ఎత్తుగడ.  సంయమనంతో వ్యవహరిస్తే దక్కే ప్రత్యేక హోదా రాకుండా, అత్యుత్సాహం, రాజకీయ కారణాలతో, కేసులకు భయపడి చంద్రబాబు చెప్పిన డ్రామాను టీడీపీ ఎంపీలు రక్తి కట్టించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిన పరిస్థితులు కల్పించాల్సింది పోయి సేఫ్‌గా బయటపడేసే కుట్రకు చంద్రబాబు వ్వూహ రచన చేసి.. ఏపీ ప్రజలను మరోసారి నమ్మించి నట్టేట ముంచారు. 
Back to Top