<strong>తొ</strong>మ్మిదేళ్ళ పాటు సాగిన చంద్రబాబు చీకటి పాలనలో కరెంటు చార్జీల పెంపు పేరిట ప్రజలు వరుసగా నిలువుదోపిడీకి గురైన వైనం నుంచి దృష్టి మళ్ళించడానికే టిడిపి విద్యుత్ రంగంపై బ్లాక్ పేపర్ విడుదల చేసినట్లు కనిపిస్తోంది.<br/>తెలుగుదేశం పార్టీ ఇలా ఒక బ్లాక్ పేపర్ను అదీ విద్యుత్ రంగంపై విడుదల చేయడం విడ్డూరం. విద్యుత్ రంగానికి సంబంధించి తన హయాంలో అనుసరించిన, అవలంబించిన అపసవ్య, అస్తవ్యస్త విధానాలను ప్రజలు మరచిపోయారని చంద్రబాబు భ్రమ పడుతున్నట్లుంది.<br/><strong>తన ప్రత్యక్ష మద్దతుతో మనుగడ సాగిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాకుండా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని టార్గెట్ చేయడానికే టిడిపి ఈ బ్లాక్ పేపర్ను విడుదల చేసిందన్నది సుస్పష్టం. డాక్టర్ వైయస్ఆర్ హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల వ్యయాల పెంపునకు సంబంధించి అనిర్దిష్ట - అస్పష్ట ఆరోపణలు చేయడం కాకుండా ఏయే ప్రాజెక్టుల వ్యయాలు పెరిగాయో బ్లాక్ పేపర్ విస్పష్టంగా ప్రకటించి ఉంటే బాగుండేది.</strong><br/><strong>ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ముఖ్య కారణాల్లో ఒకటైన పదేళ్ళ టిడిపి పరిపాలనలోని విపరీతమైన అవినీతి, అసమర్థతల గురించి కూడా చర్చించి ఉంటే బ్లాక్ పేపర్కు కొంతైనా విశ్వసనీయత వచ్చి ఉండేది.</strong><br/>1. <strong>విద్యుత్ సంక్షోభానికి సంబంధించి రాష్ట్ర ప్రజల మనసులను తొలుస్తున్న అంశాలు మూడు.</strong><strong><br/></strong><strong>(అ) రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో విద్యుత్కు కొరత ఎందుకు ఏర్పడింది?</strong><strong>(ఆ) మనకు అన్ని వనరులూ ఉన్నప్పటికీ వరుసగా అది కూడా భారీగా కరెంటు చార్జీలు ఎందుకు పెంచుతున్నట్లు?</strong><strong>(ఇ) వైయస్ఆర్ ప్రభుత్వం తన ఐదేళ్ళ పాలనలో వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచిత విద్యుత్ను అందిస్తూ కూడా ఏ వర్గానికీ కరెంటు చార్జీలు పెంచకుండా ఎలా విద్యుత్ రంగాన్ని నిర్వహించగలిగింది?</strong><strong><br/></strong>2. బ్లాక్ పేపర్ భావిస్తున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కారణం విద్యుదుత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టులు లేకపోవడం కాదు. ఈ విషయం చంద్రబాబుకు ఇంకా అవగతమైనట్లు కనిపించడం లేదు. ఇవాళ మనకు విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యానికి కొరత లేదు. కానీ కావలసినంత బొగ్గు, గ్యాస్ లేకపోవడమే అసలు సమస్య. మనకు మరో 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఉన్నప్పటికీ దానికి కావలసిన ఇంధనం లేకపోతే ప్రయోజనం ఏమిటి?3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాచివేత విధానాలే నేటి విద్యుత్ సంక్షోభానికి దారి తీశాయి.<br/>4. <strong>ఇక రాష్ట్ర ప్రభుత్వం తరచూ విద్యుత్ చార్జీలను ఎందుకు పెంచుతూ పోతోందన్నది తర్వాతి ప్రశ్న.</strong><strong><br/></strong>5. గత నాలుగేళ్ళుగా ఆదాయంలో కానీ అప్పుల్లో కానీ భారీ పెరుగుదలతో ఆర్థిక వనరులు అందుబాటులో ఉండగా ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తూ వరుసగా కరెంటు చార్జీలను పెంచడాన్ని చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ పేపర్లో ఎందుకు నిలదీయడం లేదు?6. 2008 - 09లో రూ. 62,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2011 - 12లో రూ. 1.09 లక్షల కోట్లకు, 2013 - 14లో రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకున్న విషయం చంద్రబాబుకు తెలియదా?<br/>7. కేవలం గత నాలుగేళ్ళలో రూ. 50,000 కోట్ల మేరకు రాష్ట్ర వార్షికాదాయం పెరగగా, తరచుగా కరెంటు చార్జీలను ఎందుకు పెంచుతున్నారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తన సో కాల్డు బ్లాక్ పేపర్లో ఎందుకు నిలదీయలేదు?8. గత మూడేళ్ళలో బడ్జెట్తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం మునిసిపల్ పన్నులు, నీటి చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిన సంగతి చంద్రబాబుకు తెలియదా?<br/>9. 2008 - 09లో రూ. 93 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణాలు 2012 - 13 నాటికి రూ. 1.55 లక్షల కోట్లకు చేరి కేవలం నాలుగేళ్ళలోనే రూ. 62,000 కోట్లకు పెరిగిన వాస్తవం చంద్రబాబుకు తెలియదా? 2013 - 14లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 25,000 కోట్ల మేరకు అదనంగా అప్పులు తేవడం లేదా?10. బడ్జెట్, బడ్జెటేతర మార్గాల ద్వారా సమకూరుతున్న డబ్బునంతా రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లని చంద్రబాబు తన బ్లాక్ పేపర్లో ఎందుకు నిలదీయలేదు?11. రాష్ట్ర వనరులు గణనీయంగా పెరిగినప్పటికీ తరచుగా ప్రభుత్వం భారీగా కరెంట్ చార్జీలను ఎందుకు పెంచుతోందని చంద్రబాబు బ్లాక్ పేపర్లో ఎందుకు ప్రశ్నించలేదు?12. నిర్దిష్టమైన రీతిలో ప్రశ్నలు వేయకుండా చంద్రబాబు ఎందుకు డొంక తిరుగుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు?13. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను నొప్పించడం చంద్రబాబుకు ఇష్టం లేదని తేలిపోయింది.<br/>14. <strong>కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఎందుకు పనిచేయడం మానేశాయో ఎవరికీ అంతుబట్టని విషయంగా మారింది.</strong><strong><br/></strong>15. కాగ్, మీడియా, విపక్షం, కోర్టుల విమర్శలకు జడిసి కేంద్రప్రభుత్వం అన్ని కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోవడం మానేసింది. దేశంలో భారీగా బొగ్గు నిల్వలున్నప్పటికీ విదేశీ బొగ్గు దిగుమతులపై ఆధారపడడం, ఇది వాణిజ్యలోటుకు దారితీయడం ఎంత విచారకరం? అటవీ అనుమతులు వంటి వివిధ అంతర్ మంత్రిత్వ శాఖల మధ్య భేదాభిప్రాయాలకు సంబంధించిన రొటీన్ అంశాలపై కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గత మూడేళ్ళుగా బొగ్గు ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. దీని వల్ల అనేక బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు సమస్యను ఎదుర్కొంటున్నాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ 200 కోల్ బ్లాకులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించింది. కానీ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఈ ప్రాజెక్టులన్నిటినీ ఠంచనుగా నిలిపివేశాయి.<br/>16. విదేశాల నుండి దిగుమతి చేసుకునే బొగ్గు ధర స్వదేశీ బొగ్గుతో పోల్చితే రెట్టింపు. 2012లో మన బొగ్గు దిగుమతులు 80 మిలియన్ టన్నులు, ప్రస్తుత, రాగల సంవత్సరాల్లో ఇది 185 మిలియన్ టన్నులకు చేరగలదని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు. ఇంత భారీ యెత్తున జరిగే అదనపు బొగ్గు దిగుమతులకు సరిపడా మనకు ఓడరేవు వసతులు ఎక్కడ ఉన్నాయి? ఈ బొగ్గు దిగుమతులను నిర్వహించడానికి భారత రైల్వేలను సన్నద్ధం చేశారా? అయితే, అంతిమంగా విద్యుదుత్పత్తి వ్యయం ఎంతకు చేరుతుంది?<br/>17. ఈ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్, బొగ్గు, గనులు, రైల్వేలు, పర్యావరణ మంత్రిత్వ శాఖలతో సమావేశం ఏర్పాటు చేయవలసింది ప్రధానమంత్రి. దురదృష్టవశాత్తు వీటిలో అనేక ప్రాజెక్టులు సిబిఐ దర్యాప్తులో ఉండి కేటాయింపుల రద్దు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.18. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బొగ్గును దిగుమతి చేసుకుని సదరు ఖర్చును నిస్సహాయులైన వినియోగదారులపైకి నెట్టేయాలని భావిస్తోంది.<br/>19. సహజ వాయువు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నానాటికీ గ్యాస్ ఉత్పత్తి తగ్గుతూ పోతోంది. రిలయన్సు ఇండస్ట్రీస్ మినహా 2002లో కేజీ బేసిన్ కాంట్రాక్టులు పొందిన తక్కిన మూడు కంపెనీలు ఇంత వరకూ ఒక్క క్యూబిక్ మీటర్ గ్యాస్ను కూడా ఉత్పత్తి చేయలేదు. అయినప్పటికీ వాటి మీద చర్యలు లేవు. తాజా గ్యాస్ బ్లాకుల అన్వేషణ కేటాయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీని వల్ల దేశం దేశీయ ఉత్పత్తితో పోల్చితే మూడు రెట్లు అధిక వ్యయంతో కూడిన దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది.<br/>20. బొగ్గు, గ్యాస్ లేకపోతే దేశంలో విద్యుదుత్పత్తి మెరుగుపడేదెలా? విద్యుత్ లేనిదే వృద్ధిని ఆశించగలమా? వృద్ధి లేనిది సామాజిక న్యాయం ఎక్కడిది?21. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో లాగా మన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ సరఫరాను సాధించలేకపోతోంది?<br/>22. <strong>1994 - 2004 మధ్య విద్యుత్ రంగంపై టిడిపి ప్రభుత్వం పనితీరుకు సంబంధించిన అనేక వాస్తవాలను బ్లాక్ పేపర్ మరుగుపరిచింది. ఆ పదేళ్ళ కాలంలో టిడిపి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దానిని ఏ విధంగానూ దాచిపెట్టలేదు. అలాంటప్పుడు వారు ఎందుకు ఈ బ్లాక్ పేపర్ విడుదలతో ప్రజలను తికమక పెట్టాలని చూస్తున్నట్లు?</strong><strong><br/></strong>23. ఒకప్పుడు విద్యుత్ బోర్డు పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితి ఎలా ఉంది? ఆ తరవాత నేడు పరిస్థితి ఏమిటి అన్నది గమనించాలి? 1989 నుండి 1994 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీఎస్ఈబీ (రాష్ట్ర విద్యుత్ మండలి) నిర్వహణ లాభాలతో కొనసాగిన మాట వాస్తవం కాదా?24. ఆ తరవాత చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉన్న 1994 నుండి 2004 వరకూ అంటే టిడిపి హయాంలో... ఈ పదేళ్ళలో ప్రతి ఒక్క ఏడాదీ ఏపీఎస్ఈబీ నష్టాలతో సతమతమై, అంతా కలిపి మొత్తం రూ. 20 వేల కోట్ల మేరకు భారీ నష్టాలు పేరుకుపోయిన మాట నిజం కాదా?<br/>25. టిడిపి హయాంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు. దాని పర్యవసానం మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 1994 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రెవెన్యూ మిగులు కాస్తా చంద్రబాబు నాయుడుగారు విద్యుత్ సంస్థతో ఆడిన చెలగాటం ఫలితంగా తలక్రిందులై ఏకంగా రూ. 22 వేల కోట్ల లోటు పేరుకుపోయిన సంగతి వాస్తవం కాదా?<br/>26. టిడిపి నిర్వాకం కారణంగా 1994 మార్చి 31 నాటికి 101:100 గా ఉండిన ఆస్తులు - అప్పుల నిష్పత్తి కాస్తా 1994 - 2004 మధ్య కాలంలో 45:100కు పడిపోవడం వాస్తవం కాదా? అంటే చంద్రబాబుగారి పాలనలో ఆస్తులు 45 అయితే అప్పులు 100.27. 2004 - 09 మధ్య కాలంలో అంటే మహానేత వైయస్ హయాంలో 31-3-2009 నాటికి ఈ నిష్పత్తి 120 : 100కు పెరిగిన మాట నిజం కాదా?<br/>28. అంతకు ముందు పదేళ్ళపాటు ఏటా లాభాలు ఆర్జిస్తూ వచ్చిన విద్యుత్ సంస్థను, తమ పదేళ్ళ పాలనలో ఏటా నష్టాల్లోకి నెట్టి... ఆ నష్టాలను పూడ్చుకునేందుకు వ్యవసాయం సహా ప్రతి వర్గం వినియోగదార్ల మీదా దాదాపు ప్రతి ఏటా భారాన్ని మోపి అయినా చివరికి భారీగా విద్యుత్ బోర్డుకు నష్టాలు మిగిల్చి... తాను విద్యుత్ బోర్డును సంస్కరించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటే... ఇంతకంటే హాస్యాస్పదం అయిన విషయం ఉందా?29. లాభాల్లో ఉన్న సంస్థను... ఏటా నష్టాలే మిగిలేలా ఊబిలోకి తోసేసి... ఆ సంస్థను సంస్కరించానని చెప్పుకుంటున్నారంటే... ఇదేనా చంద్రబాబు నాయుడుగారు ఎం.ఏ. ఎకనామిక్సు చదవటం ద్వారా నేర్చుకున్న చదువు అనే అనుమానం కలుగుతోంది.<br/>30. ప్రతి ఏడాదీ అన్ని వర్గాలకు సంబంధించిన వినియోగదారుల కరెంటు చార్జీలను ఠంచనుగా పెంచుతామని ప్రపంచ బ్యాంక్తో టిడిపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజం కాదా?31. వైయస్ఆర్ పరిపాలన కొనసాగిన ఐదేళ్ళలో... 2003 - 04లో 800 కోట్ల యూనిట్లుగా ఉన్న వ్యవసాయ విద్యుత్ వినియోగం 2008 - 09 నాటికి 1500 కోట్ల యూనిట్లకు చేరినప్పటికీ ఎన్నడూ ఏ వర్గానికీ కరెంటు చార్జీలు పెంచని మాట వాస్తవం కాదా?<br/>32. 2004తో పొల్చితే 2009లో పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ యూనిట్కు 75 పైసలు తక్కువగా ఉండిన మాట నిజం కాదా?33. విద్యుత్ చార్జీలను మాత్రమే కాదు, వ్యాట్ రేట్, ఆర్టీసీ చార్జీలు, నీటి బిల్లులు, మున్సిపల్ టాక్సులు ఏవీ కూడా 2004 - 09 మధ్య కాలంలో ఒక్కసారి కూడా పెంచని మాట వాస్తవం కాదా?34. టిడిపి హయాంలో 5.7 శాతంగా ఉండిన రాష్ట్ర వార్షిక ఆర్థిక వృద్ధి రేటు, ఆ తరవాత వైయస్ఆర్గారి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకపోవటం, నాణ్యమైన కరెంటు సరఫరా చేయటం, రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ వంటి కారణాల వల్ల 2004 - 09 ఐదేళ్ళ కాలంలో 9.07 శాతానికి పెరిగిన మాట నిజం కాదా?<br/>35. టిడిపి హయాంలో కేవలం 8 శాతంగా ఉన్న వస్తూత్పత్తి రంగం వార్షిక వృద్ధి రేటు వైయస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల 2004 - 09 మధ్య కాలంలో 13 శాతంగా నమోదై రికార్డు వృద్ధి సాధించిన మాట నిజం కాదా?36. వ్యవసాయ రంగం వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో కేవలం 3.25 శాతం కాగా వైయస్ హయాంలో అది 6.87 శాతం కావడం నిజం కాదా?<br/>37.<strong> తెలుగుదేశం ఇచ్చిన బ్లాక్ పేపర్లో 2004 తరవాత ప్రైవేటు విద్యుదుత్పత్తి దార్ల నుంచి ఎక్కువగా విద్యుత్ కొనుగోలు చేశారని తప్పుపట్టారు. ఎంత పరిహాసాస్పదమైన ఆరోపణ? చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ పరిపాలనలో తానే ఆర్థిక సంస్కరణలకు ఆదిపురుషుడినని, ప్రైవేటీకరణకు తానే రియల్ చాంపియన్నని చెప్పుకు తిరిగిన మాట వాస్తవం కాదా?</strong><strong><br/></strong>38. ప్రైవేటు రంగం సేవలో నిండా తరించింది ఎవరు? చంద్రబాబు నాయుడా? దివంగత మహానేత రాజశేఖర్రెడ్డి గారా?39. ప్రైవేటు పెట్టుబడుల కోసమంటూ ఏటా డావోస్ యాత్రలు చేసింది ఎవరు?40. తన తొమ్మిదేళ్ళ హయాంలో ఏపీ జెన్కో ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగానికి ఎంత మేరకు అదనపు విద్యుదుత్పత్తి సమకూరిందో చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలరా?41. నిజానికి తన హయాంలో విస్పష్టమైన కారణాలతో ప్రైవేటు రంగం పట్ల ఎక్కడా లేని పక్షపాతం ప్రదర్శించిన చంద్రబాబు ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి వైయస్ఆర్ పాలనా కాలంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే కారణమని నిందిస్తూ తప్పుదోవ పట్టించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు?<br/>42. 1995 ఫిబ్రవరి 17 - 18 నాడు కనీసం ఆదాయం పన్ను చెల్లిపుదారులు కాకపోయినా, గ్యాస్, బొగ్గు లింకేజీలు లేకపోయినా కూడా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్ధ్యానికి సంబంధించి వివిధ ప్రైవేటు సంస్థల వారితో ఆదరా బాదరాగా, హడావుడిగా అర్ధరాత్రి 23 ఎంఓయులను కుదుర్చుకున్నది ఎవరి ప్రభుత్వం? ఈ చీకటి ఒప్పందాలే రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్ చేయలేదా? ఇంతకంటే చీకటి ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నాయా?43. విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ ఇఏఎస్ శర్మ సలహాను ఖాతరు చేయకుండా ఈ అర్ధరాత్రి సంతకాల సిగ్గుమాలిన చర్యతో యావద్దేశం నివ్వెరబోయిన మాట నిజం కాదా? ఇలా అవమానించడం వల్ల డాక్టర్ శర్మ ఢిల్లీ సర్వీసులకు వెళ్ళిపోయారు. ఆయన ఢిల్లీలో కేంద్ర విద్యుత్ కార్యదర్శిగా నియమితులయ్యారు.<br/>44. మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే బీహెచ్ఇఎల్కు అప్పగించాల్సిన ముద్దనూరు విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసి 23 అర్ధరాత్రి ఎంఓయులలో భాగంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించారు.45. టిడిపి బ్లాక్ పేపర్ దీనిని గురించి ఎందుకు ప్రస్తావించలేదు?<br/>46. 31-3-1997 నాడు టిడిపి ప్రభుత్వం 6 షార్టు జనరేషన్ పవర్ ప్రాజెక్టులు, 8 నాఫ్తా ఆధారిత ప్రాజెక్టుల కోసం యూనిట్కు 97 పైసలు మొదలుకుని 135 పైసల వరకూ ఫిక్సుడ్ పవర్ టారిఫ్లతో పిపిఎలు కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా?47. నాడు ముద్దుకృష్ణమ నాయుడు - ఇతర పార్టీల వారితో కలిసి దీనిపై రాద్దాంతం చేయలేదా? అది పెద్ద కుంభకోణం కాలేదా?48. టిడిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి యూనిట్కు 97 పైసల చొప్పున అన్ని ప్రాజెక్టులకూ సమానంగా ఫిక్సుడ్ టారిఫ్ను అమలు చేసేలా చేసిన ఘనత దివంగత డాక్టర్ వైయస్ఆర్ది కాదా?<br/>49. గత పనితీరు, ఆర్థిక సామర్ధ్యం, అనుభవం ఆధారంగా ఐసీఐసీఐ షార్టు జెస్టేషన్ పవర్ ప్రాజెక్టుల బిడ్లను అంచనా కట్టగా దాని ఆధారంగా టిడిపి ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో వారికి ఈ ప్రాజెక్టులు కట్టబెట్టింది.50. కానీ ఆ తరవాత జరిగింది మాత్రం పూర్తిగా వేరు. ప్రమోటర్లు మారిపోయారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాలు మారిపోయాయి. ఇదంతా కేబినెట్ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఆకస్మికంగా ఎక్కడి నుండో ఊడిపడిన టిడిపి సభ్యుడు ఎంవివిఎస్ మూర్తికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక స్వల్ప కాలిక విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టారు.<br/>51. సుమారు 2000 మెగావాట్ల నాఫ్తా ఆధారిత పవర్ ప్రాజెక్టులను ఆమోదించడం రాష్ట్రానికి ఇంధనం వాడకంలో మార్పు చేసిన మాట నిజం కాదా?52. విపక్షాలన్నీ కలిసి ఒత్తిడి చేయగా టిడిపి ప్రభుత్వం ఆ తరవాత విద్యుత్ ప్రాజెక్టుల ఇంధనం వాడకంలో మార్పు చేసిన మాట నిజం కాదా?53. కేజీ బేసిన్లో గ్యాస్ అందుబాటులో లేనందున విద్యుత్ ప్రాజెక్టుల ఇంధనాన్ని నాఫ్తా నుండి బొగ్గుకు మార్చాలని విపక్షాలు స్పష్టంగా చెప్పాయి.54. విపక్షాలే కాకుండా గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు వద్దంటూ విద్యుత్ రంగ నిపుణులు కూడా నాడు టిడిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా చేయలేని పక్షంలో ఎలాంటి పెనాల్టీ చెల్లించడానికి గెయిల్ ముందుకు రాకపోయినప్పటికీ ఎందుకు టిడిపి ప్రభుత్వం విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు గ్యాస్ను ఎంచుకున్నట్లు?<br/>55. గ్యాస్ సరఫరా లేకపోయినా కూడా ప్రభుత్వం పరిహారం కోరలేక నిస్సహాయంగా ఉండిపోవడానికి ఈ తప్పుడు నిర్ణయం కారణం కాదా? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఇదే అతి పెద్ద - ఏకైక కారణం కాదా?56. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడైన ఎంవివిఎస్ మూర్తికి బలిమెల హైడ్రో ప్రాజెక్టును బరితెగించి కట్టబెట్టిన సంగతి వాస్తవం కాదా?<br/>57. 1997లో ఏపీజీపీసీఎల్ గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టును కేవలం మెగావాట్కు రూ. 2.7 కోట్లకు అమలు చేస్తుండగా జీవీకే, స్పెక్ట్రమ్ వంటి ప్రైవేటు ప్రాజెక్టులను (మెగావాట్కు) రూ. 5. కోట్లకు అనుమతించింది చంద్రబాబు నాయుడు గారు.58. అప్పుడంతా ప్రైవేటీకరణతో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన టిడిపి ఇప్పుడు ప్రైవేటైజేషన్ ప్రస్తావన తెచ్చి దివంగత వైయస్ను ఆడిపోసుకోవడం విడ్డూరం కాక మరేమిటి?<br/>59. నాడు ప్రైవేటు కంపెనీలకు అన్ని ప్రయోజనాలూ సమకూర్చిన చంద్రబాబు నాయుడు నేడు తానేదో ప్రైవేటైజేషన్కు, అవినీతికీ వ్యతిరేకం అన్నట్లు కబుర్లు చెబుతున్నారు. ఈ అవకతవకలన్నిటిపై సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధమేనా?60. ఏ విధంగా చూసినా టిడిపి విడుదల చేసిన బ్లాక్ పేపర్- అర్ధ సత్యాలతోనూ, అవాస్తవాలతోనూ కూడుకున్న నిష్ప్రయోజక పత్రం మాత్రమే.