అగ్రి గోల్డ్ సం’గతి’ అంతేనా??


అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి పెట్టుబడులు సేకరించి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డు సంస్థ
లక్షల్లో బాధితులు...
కోట్లల్లో డిపాజిట్లు...
వేలం కాని ఆస్తులు
సిఐడీ కేసులు...
ఆలసత్వం, అలక్ష్యంతో బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాలు...
ఇదీ అగ్రీగోల్డు కథ. కథ కాదు మోసపోయిన కొన్ని లక్షలమంది బాధితుల వ్యధ.
అగ్రిగోల్డు ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేస్తుందని ఆశించారు బాధితులు. కానీ చంద్రబాబు సర్కార్ అటు తెలంగాణా ప్రభుత్వం అగ్రిగోల్డ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కోర్టు జోక్యం చేసుకుని సిఐడీ దర్యాప్తుకు ఆదేశించింది. సిఐడీ ఆస్తులను జప్తు చేసుకుని వేలానికి పెట్టింది. దీంతో తమ సొమ్ము తిరిగి వస్తుందని బాధితులు సంతోషించారు. అయితే డీమానిటైజేషన్ సమయంలో సంస్థలేవీ అగ్రిగోల్డు ఆస్తులను కొనేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత వచ్చిన జిఎస్సెల్స్ గ్రూపుకు చెందిన సుభాష్ చంద్ర ఫౌండేషన్, అగ్రిగోల్డు ఆస్తులు కొంటామని కోర్టుకు తెలియపరిచింది. తీరా బాధితుల, ఆస్తుల వివరాలు సేకరణ తర్వాత ఆస్తుల కంటే అప్పులే ఎక్కువున్నాయంటూ చేతులెత్తేసింది. మళ్లీ అగ్రీగోల్డ్ ఆస్తుల టేకోవర్ కు సిద్ధం అని చెప్పినా ప్రభుత్వాలు సహకరించడం లేదు కనుక తాము డిపాజిట్ గా ఇచ్చిన 10 కోట్లు తిరిగి ఇచ్చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది సుభాష్ చంద్ర ఫౌండేషన్. మేమెంతగా ప్రయత్నించినా అగ్రిగోల్డు యాజమాన్యం కానీ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ టేకోవర్ కు అవకాశం కల్పించే చర్యలు తీసుకోవడం లేదని, కనుక ఈ ఒప్పందాన్ని విరమించుకుంటామని చెబుతోంది జీ సంస్థ.  దీంతో అగ్రిగోల్డు బాధితుల కథ మొదటికే వచ్చింది. 
పెట్టుబడులు తిరిగి రాక బాధితులు, డిపాజిటర్ల తో పడలేక ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉన్నదంతా డిపాజిట్లు చేసి, అవి తిరిగి వస్తాయో రావో అని ఎదురు చూస్తూ గుండెపోటుతో కొందరు మరణిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్టైనా లేదు. అగ్రిగోల్డు ఆస్తులు కొంటామని ముందుకొచ్చిన సంస్థలను నిబంధనల పేర భయపెట్టి వేలం కానీకుండా ఆపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అగ్రిగోల్డు ఆస్తులను చవకగా సొంతం చేసుకోవాలని చంద్రబాబు ఆడుతున్న కుట్రలో ఇది భాగం అంటున్నారు కొందరు సీనియర్ నాయకులు. ఇప్పటికే ఆ దిశగా బాబు పావులు కదువపుతున్నాడని కూడా చెబుతున్నారు. సదావర్తి భూములు వ్యవహారంలో లాగే బినామీలను రంగంలోకి దించాలనుకుంటున్నట్టు వారంటున్నారు. అందుకే అగ్రిగోల్డు ఆస్తుల వ్యవహారంపై కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా అంటున్నారు. 
చాలరోజులుగా తప్పించుకు తిరిగి కొన్నాళ్ల కింద అరెస్టు అయిన అగ్రిగోల్డ్ డైరెక్టర్లు బెయిల్ పై విడుదలై దర్జాగా తిరుగుతున్నారు. ఉన్నదంతా ఊడ్చిపెట్టుబడులు పెట్టిన వారు, పెట్టించిన ఏజెంట్లు దిక్కు తోచక ప్రాణాలు తీసుకుంటున్నారు. పాదయాత్రలు చేస్తూ, ముఖ్యమంత్రికి వినతులు చేస్తూ, నిరసనలు వ్యక్తం చేస్తూ, దీక్షలకు పూనుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో కొందరు బాధితులు ప్రభుత్వం న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని శిబిరం వారు నుంచే హెచ్చరిస్తున్నారు. 
ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు సంస్థల వెనక్కు తగ్గడంతో అగ్రిగోల్డు బాధితులు సం’గతి’ ఇక అంతేనేమో అంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. 







 

తాజా వీడియోలు

Back to Top