విజయవాడ: వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు కుట్రదారులు, పాత్రదారులు, సూత్రదారులు ఎవరున్నారో బహిర్గతం చేయాలని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి డిమాండు చేశారు. ఎన్ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పు అనే విషయం ఇవాళ సీపీ లడ్డా ప్రెస్మీట్లో వెల్లడైందన్నారు. కుప్పం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. హత్యాయత్నం కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎట్టి పరిస్థితిలో బహిర్గతం కాకుండా, బహ్యప్రపంచానికి తెలియకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును ఒక్క శ్రీనివాస్పైనే చుట్టి, కర్త, కర్మ, క్రియ అంతా శ్రీనివాస్ అనేవిధంగా చేసిన వైనాన్ని కుట్రగా భావిస్తున్నామన్నారు. కేసు రిజిస్ట్రర్ చేసే సమయంలో కూడా 120 బీ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ కేసులో 307 మాత్రమో నమోదు చేశారని, కుట్రకోణంపై విచారించాలనే ఆలోచన లేదన్నారు. రాష్ట్ర పోలీసులు అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం కేసు నమోదు చేసిన తరువాత కూడా కుట్ర కోణంలో విచారణ చేయలేదన్నారు. పాత్రదారులు, సూత్రదారులను బహిర్గతం చేయకూడదన్నదే పోలీసుల ఉద్దేశమన్నది ఈ రోజు పోలీసు కమిషనర్ లడ్డా ప్రెస్మీట్ సారాంశమన్నారు. వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ ప్రెస్మీట్ పెట్టి ‘‘జగన్ అడిన పబ్లిసిటీ స్టంట్ నాటకం’’ అని దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారన్నారు. అది తప్పని మాత్రమే ఈ రోజు లడ్డా ప్రెస్మీట్లో చెప్పారన్నారు. వైయస్ జగన్పై డీజీపీ అపవాదు మోపితే ..ఈ రోజు లడ్డా ప్రెస్మీట్లో పటాపంచాలు చేశారని, శ్రీనివాస్ కుట్రలో భాగస్తుడని, ఎవరికీ సంబంధం లేదని చెప్పారన్నారు. 120బీ కేసు నమోదు చేసి ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. సూత్రదారులను బహిర్గతం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఇవాళ జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే కోర్టును ప్రభావితం చేసి వైయస్ జగన్పై ఉన్న కేసులను కొట్టేయిస్తాడన్నది మీ అభిప్రాయమా అని చంద్రబాబును ప్రశ్నించారు. అలాంటివి చంద్రబాబుకు బాగా అలవాటు అని, వైయస్ జగన్ అలాంటి వాటికి దూరమన్నారు. చంద్రబాబు మీద 27 కేసులు ఇవాల్టికీ స్టే రూపంలో ఉన్నాయంటే ..ఆ కేసులు ముందుకు వెళ్లకుండా మీరు కోర్టును మేనేజ్ చేశారా అని సూటిగా ప్రశ్నించారు. కోర్టులు మేనేజ్ అవుతాయన్నది మీ అభిప్రాయమా అని నిలదీశారు. న్యాయ వ్యవస్థ అంటే చంద్రబాబు అంత చులకనా భావమా అని మండిపడ్డారు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. శక్తియుక్తులను ఉపయోగించి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు మించన వారు దేశంలోనే లేరన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను కంటెంట్ ఆఫ్ కోర్టు చట్టం కింద పరిగణించాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ప్రధాని కోర్టును ప్రభావితం చేస్తారని చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబుపై 27 కేసులు ఉన్నాయన్నారు. వైయస్ జగన్పై ఉన్న కేసులు గాలి బుడగ లాంటివని పేర్కొన్నారు. ఈ కేసుల్లో వైయస్ జగన్ ప్రమేయమే లేదన్నారు. వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదురించిన మరుక్షణమే అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు. కాంగ్రెస్ నేత శంకర్రావుతో లేఖ రాయించి, టీడీపీ నేతలు అశోక్గజపతిరాజు, ఎ్రరనాయుడితో కేసులు ఏ విధంగా నడిపించారో కోర్టులోని ఏ కూర్చిని, గోడను అడిగినా కూడా స్పష్టంగా చెబుతుందన్నారు. చంద్రబాబుకు ఉన్న అలవాట్లు ఇతరులపై రుద్దడం సరికాదన్నారు. చంద్రబాబు ఎంత మభ్యపెట్టినా..వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగిన వెంటనే చంద్రబాబు చూపిన కాఠిన్యం ప్రజలందరూ చూశారన్నారు. న్యాయవ్యవస్థ పరువు తీయొద్దని సూచించారు. వైయస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్ర కోణంలో విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. పాడేరు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముపై మావోయిస్టులు దాడి చేసి హత్య చేస్తే వెంటనే ఎన్ఐఏకు బదిలీ చేశారని, వైయస్ జగన్ కేసును ఎందుకు ఎన్ఐఏకు అప్పగించడం లేదని నిలదీశారు. డీజీపీ ఈ కేసును ఎందుకు నీరుగార్చుతున్నారని ప్రశ్నించారు. ఎయిర్పోర్టులో ఏ నేరం జరిగినా ఎన్ఐఏ చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ఎన్ఐఏ పరిధిలోని వచ్చే కేసు ఎందుకు రాష్ట్ర పరిధిలో పెట్టుకున్నారని నిలదీశారు. ప్రతిపక్ష నేతపై హత్యయత్నం జరిగితే సీఎం, డీజీపీ, మంత్రులు హేళనగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. విచారణను చంద్రబాబు ప్రభావితం చేశారని, ఈ కేసును ఆలస్యం చేస్తే ఇందులో సాక్ష్యాలు ఆవిరవుతాయని ఇవాళ హైకోర్టులో ఫిర్యాదు చేశామన్నారు.