తెనాలి: షాడో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అవతరించాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. తెనాలిలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం అన్నాబత్తుని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సన్రైజ్ సిటీగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు తన కొడుకు లోకేష్ను మాత్రం రైజ్ చేసుకున్నాడు కానీ రాష్ట్ర ప్రజలను రైజ్ చేయలేకపోయాడని ధ్వజమెత్తారు. అవినీతి రహిత, క్రమశిక్షణ, ట్రాన్స్పరెన్సీ అని చెప్పే చంద్రబాబు దాంట్లో ఒక్కటైనా పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు నాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. దానికి ఎలక్షన్ హామీలు నెరవేర్చకపోవడం ఒకటైతే, వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అవినీతికి పాల్పడడం మరొకటన్నారు.