రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలు ఆదివారం ఆందోళనకు దిగారు. కాటన్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పట్టిసీమ వద్దు.. పోలవరం ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ పట్టిసీమ తో వచ్చే అనర్థాల్ని వివరించారు. పోలవరం ప్రాజెక్టు తో ఉన్న లాభాల గురించి అందరికీ తెలుసని, కానీ పట్టి సీమ వైపు చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని అభిప్రాయ పడ్డారు. డిజైన్ లో లేని 1500 క్యూసెక్కుల నిల్వ ఉంచే రిజర్వాయర్ నిర్మాణం అంశాన్ని పత్రికా ప్రకటనలో వెల్లడించడం ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై స్పష్టతలేదన్న విషయాన్ని రుజువు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, గిరిజాల బాబు, ఆదిరెడ్డి అప్పారావు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.<br/>