పక్కా ప్ర‌ణాళిక‌తో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం


 – ఈ కుట్రలో చంద్రబాబు, లోకేష్,  హ‌ర్ష‌వర్ధన్, శివాజీ భాగస్వాములే
– చంద్రబాబు సంఘటన తీవ్రతను తక్కువ చేసి మాట్లాడారు
– గవర్నర్‌ను కూడా చంద్రబాబు తప్పుబట్టారు
– ఏపీ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు
– పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తోంది
– వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ్‌ పార్టీ విచారణ జరపాలి
 
న్యూఢిల్లీ:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆరు నెలల ముందే పక్కా పథకం ప్రకారమే హత్యాయత్నానికి స్కెచ్‌ గీశారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కుట్రలో చంద్రబాబు, లోకేష్, హర్షవర్ధన్, శివాజీ భాగస్వాములే అన్నారు. ఈ ఘటనపై థర్డ్‌ పార్టీతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఏపీ పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.   వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను మంగళవారం ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు మీడియాకు వివరించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..
 

తమ పార్టీ అధ్యక్షు,  ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్యకు సాక్షాత్తూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ నెల 25వ తేదీ వైయ‌స్ జగన్‌పై విశాఖపట్టణం విమానాశ్రయంలో హత్యాయత్నం జ‌రిగింద‌న్నారు. సంఘటన జరిగిన గంటలోపే ఈ హత్యాయత్నాన్ని వైయ‌స్ఆర్‌సీపీ పైకి నెట్టేసి డీజీపీ చేతులు దులిపేసుకోవడం, ఆ తరువాత చంద్రబాబునాయుడు వెకిలిగా మాట్లాడ్డం చూస్తే ఇంకా వీరి విచారణను ఎలా నమ్మాలి? అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము కేంద్ర దర్యాప్తు సంస్థలచేత నిష్పాక్షిక విచారణను కోరుతున్నామని డిమాండు చేశారు.  అసలు ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విలేకరుల ముందరే  చంద్ర‌బాబు వాడిన పదజాలం చూస్తే ముఖ్యమంత్రికి ఎంత అక్కసు ఉందో... కడుపులో వైయ‌స్ జగన్‌పై ఎంతటి విషం దాచుకుని ఉన్నారో అర్థం అవుతోందని ధ్వజమెత్తారు.  ఈ ఉదంతంలో చంద్రబాబు ఓ ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నేత పట్ల ప్రదర్శించాల్సిన కనీస మర్యాదను గాని, సంప్రదాయాన్ని గాని పాటించలేదని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ‘వాడు, వీడు’అని ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మాట్లాడ్డం చూస్తే చంద్రబాబుకు ఏ కోశానా మానవత్వం అనేదే లేదని, ఆయన మొహంలో క్రూరత్వమే కనపడుతోందని దుయ్యబట్టారు.

విమానాశ్రయంలోకి అసలు కత్తి ఎలా వచ్చిందనే ప్రశ్నను పక్కకు నెట్టేసి చంద్రబాబు హేళనగా మాట్లాడ్డం చూస్తే ఇక ఈ ప్రభుత్వం నియమించే విచారణ ఎలా సాగుతుందో చెప్పకనే చెబుతోందన్నారు.  ఈ సంఘటన జరిగినపుడు ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తొలుత ఆశించామని, కానీ ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై ఏ మాత్రం సానుభూతి లేకుండా అదేదో డ్రామా కింద అధికారపక్షం కొట్టి పారేయడం తీవ్ర ఆక్షేపణీయమని   ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధిపతి అయిన డీజీపీ ఒక వైపు, ముఖ్యమంత్రి మరోవైపు ఈ సంఘటనపై తేలికగా, హేళన పూరితంగా మాట్లాడ్డం చూసిన తరువాత  టీడీపీ ప్రభుత్వ పాలనలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. పబ్లిసిటీ కోసమే ఈ సంఘటనకు పాల్పడ్డాడని నిర్థారించడం, చంద్రబాబు కూడా అదే పనిగా జగన్‌పైనే నిందలు వేస్తూ మాట్లాడ్డం చూస్తుంటే.. ప్రభుత్వమే వైయ‌స్‌ జగన్‌ హత్యకు కుట్ర పన్నిందన్న అనుమానాలు బలపడుతున్నాయని  అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం స్పందించి థ‌ర్డ్ పార్టీతో విచార‌ణ చేయించాల‌ని విజ‌య‌సాయిరెడ్డి డిమాండు చేశారు.  

– ముఖ్యమంత్రి పదవికి తన కుమారుడు లోకేష్‌ కూడా అడ్డు వస్తారని భావిస్తే..అదే కోడికత్తితో సొంత కొడుకును కూడా చంపించే మనస్తత్వం అన్నారు. ఎన్టీఆర్‌ది సహజమరణమా అన్న అనుమానాలు ఇంతవరకు ఉన్నాయన్నారు. టీడీపీ నాయకులు రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డంగా మాట్లాడారన్నారు. ఒక మనిషి మాట్లాడే మనిషి మాటలా అని ప్రశ్నించారు. అలిపిరి ల్యాండ్‌ మైన్‌లో చంద్రబాబును చంపేందుకు నక్సలెట్లు ప్లాన్‌ చేస్తే.. తన భార్యే సీఎం పదవి కోసం భువనేశ్వరి ఈ పని చేసిందని ఆరోపిస్తే ఆయన ఒప్పుకుంటారా అని ఒక్కసారి చంద్రబాబు ఆలోచన చేయాలన్నారు. ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేమని చెప్పారు. ఢిలీకి వచ్చి చంద్రబాబు సినిమా డైలాగులు చెప్పారని, ఆయనకు ఉన్న రక్త చరిత్ర, అవినీతి చరిత్ర, వెన్నుపోటు చరిత్ర ఉన్న వ్యక్తి రాజ్యాంగం గురించి మాట్లాడితే..ఆయన్ను ఎవరూ కూడా మనిషిగా గుర్తించరన్నారు.
 


Back to Top