అవినీతిలో ఏపీని నంబర్‌గా మార్చింది ఆ ఇద్దరే



 
– ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్‌ 6న రాజీనామాలు సమర్పించాం
– మొన్నా, నిన్నా రాజీనామాలు చేసినట్లు టీడీపీ ప్రచారం
– ఏయిర్‌ ఏషియా స్కాంలో బాబు రావడంతో విచారణ తప్పుదోవ పట్టించే యత్నం
– ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధమా?
– అవినీతి గురించి లోకేష్‌ మాట్లాడటం హాస్యాస్పదం
– పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్న బాబు ఏపీలో చేసిందేమిటి?
హైదరాబాద్‌: పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏపీలో ఆయన చేసింది ఏంటని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అవినీతిలో ఏపీని నంబర్‌వన్‌గామార్చింది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కాదా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరును ఆయన ఖండించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిథున్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. ఎయిర్‌ ఏషియా స్కాంను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా రాజీనామాల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు మంత్రిగా పనిచేసిన శాఖకు సంబంధించి ఎయిర్‌ ఏషియా సంస్థలో స్కాంపై సీబీఐ ఎంక్వైరీ జరుగుతుందన్నారు. చంద్రబాబును వాడుకుంటే మన పనులు అవుతాయని సంస్థ సీఈఓ మాట్లాడిన వీడియో టేపులు నేషనల్‌ మీడియాలో ప్రసారం అవుతున్నాయన్నారు. సీబీఐ ఎంక్వైరీ ప్రజలకు తెలియకుండా ఉండేందుకు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాజీనామాల అంశం మాట్లాడుతున్నారన్నారు. ఏప్రిల్‌ 6వ తేదీన రాజీనామాలు చేసిన అంశాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. 

25 మంది రాజీనామాలు చేయిస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని, రాజకీయాలు పక్కనబెడదాం.. కలిసి రాజీనామాలు చేసి కేంద్రంపై పోరాడుదామని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ గతంలో అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం మీరు ముందు నడిచినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పలుమార్లు చెప్పామన్నారు. అయినా వాటికి సమాధానం చెప్పకుండా రాజీనామాల నుంచి పారిపోయిన చంద్రబాబు ఇవాళ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదని చంద్రబాబు మాట్లాడారన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైయస్‌ జగన్‌ సంతకం చేసిన లేఖతో లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలిశామన్నారు. అవిశ్వాసం పనికి రాదన్న చంద్రబాబు మేం కూడా అవిశ్వాసం పెడతామని యూటర్న్‌ తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 25 మంది రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, ప్రత్యేక హోదా సాధనలో ఒక ముందడుగు పడేదన్నారు. 
హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయడం మాని.. వైయస్‌ఆర్‌ సీపీ ప్రయత్నాలకు తూట్లు పొడుస్తూ నిందలు వేయాలని చూస్తే ప్రత్యేక హోదా రాదని చంద్రబాబు తెలుసుకోవాలని మిథున్‌రెడ్డి సూచించారు.  
హోదా పోరాటం వదిలేసి.. మా ప్రయత్నాలకు తూట్లు పొడుస్తూ నిందలు వేయాలని చూస్తే ప్రత్యేక హోదా రాదనేది తెలుసుకోవాలి. వైయస్‌ఆర్‌ సీపీపై విమర్శలు చేస్తున్న టీడీపీ ఎంపీలు ఐదేళ్ల పదవికాలంలో నాలుగేళ్లు కేంద్రాన్ని పొగడడమే సరిపోయిందన్నారు. ఆఖరి బడ్జెట్‌ బాగాలేదని యూటర్న్‌ తీసుకొని.. హోదా కావాలని అన్యాయం జరుగుతుందని మాట్లాడడం న్యాయమా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటంలో కలిసి రావాలని చెప్పినా నోరు తెరిచిన పాపానపోలేదన్నారు. ఓటుకు కోట్ల కేసు బయటపడిన వెంటనే హైదరాబాద్‌ను పారిపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెట్టారన్నారు. 

కర్ణాటకలో డెమోక్రసీ ఖూనీ అవుతుందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మాట్లాడిన చంద్రబాబు ఏపీలో ఏం చేస్తున్నారు ఆలోచించుకోవాలని మిథున్‌రెడ్డి సూచించారు. ఎన్నికల్లో గెలిచి ఎంపీగా ప్రమాణం చేయకముందే ఎస్పీవైరెడ్డిని లాక్కున్నాడని, తరువాత కొత్తపల్లి గీత, బుట్టా రేణుకను కొనుక్కున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారా చంద్రబాబూ అని నిలదీశారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చినా అతీగతి లేదన్నారు. 
ఒక మీటింగ్‌ అటెండ్‌ అయ్యారని ఇద్దరు ఎంపీలపై ఒక నెలరోజుల్లోనే చర్యలు తీసుకొని వారిపై వేటు వేశారు. కానీ ఇంత బహిరంగంగా టీడీపీలో చేరి, మహానాడులో స్పీచ్‌లు ఇస్తూ వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి.. మా పార్టీనే తిడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. అంటే బీజేపీతో టీడీపీకి సంబంధాలు ఉన్నాయో.. లేవో.. సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

లోకేష్‌ దేశ వ్యాప్తంగా అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు సంపాదించాడని, రాష్ట్రంలో ఏడీల్‌ జరిగినా లోకేష్‌ సంతకం లేకుండా జరగదని మిథున్‌రెడ్డి అన్నారు. లోకేష్‌ అలియాస్‌ పప్పు రెండు ట్వీట్‌లు చేశారని, వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారు.. అవార్డు ఇవ్వాలని ట్వీట్‌ చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని ముందు వరుసలో పెడతానని అవినీతిలో నంబర్‌ వన్‌లో పెట్టారు. ఏ సంస్థ సర్వే చేసినా అవినీతిలో నంబర్‌ వన్‌ ర్యాంకే ఇస్తున్నారన్నారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే ముందు లోకేష్‌ ఒకసారి తనవైపు కూడా చూసుకోవాలన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ విధంగా కొన్నారు.. రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. 

తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఇస్తూ పట్టుబడిన రూ. 50 లక్షల డబ్బు ఎవరిది.. డ్వాక్రా మహిళల కడుపుకొట్టి తీసుకువచ్చారా.. రైతులను అన్యాయం చేసి తీసుకొచ్చారా.. లోకేష్‌ సమాధానం చెప్పాలని మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఓట్ల రూపాయలతో రేవంత్‌రెడ్డితో డీల్‌ మాట్లాడిస్తే ఎంతకావాలో చెప్పు ఇస్తానని మాట్లాడిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. ఇలాంటి  పరిస్థితిల్లో ఉండి.. లోకేష్‌ నీతులు మాట్లాడడం సిగ్గుచేటు. ఇలాంటి ఛీప్‌ పబ్లిసిటీ స్టంట్లు మానుకోవాలని లోకేష్‌కు సూచించారు. 
 
ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మిథున్‌రెడ్డి అన్నారు. హోదా సాధన కోసం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో రాజీనామా సైతం చేశామన్నారు. హోదా సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ప్రతిపక్ష ఎంపీలుగా రాజీనామాలు చేశాం.. ఉప ఎన్నికలకు వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో చూపిస్తామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top