విశాఖపట్నంః బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి బయల్దేరి అనకాపల్లి చేరుకున్నారు. అక్కడ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత నర్సీపట్నం మీదుగా వైఎస్ జగన్ చింతపల్లికి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు నిరసనగా జిల్లాలోని చింతపల్లిలో ఇవాళ బహిరంగ సభ జరగనుంది. 'విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు' అనే నినాదంతో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. బాక్సైట్ ఖనిజ తవ్వకాలపై వైఎస్సార్సీపీ కార్యచరణను వైఎస్ జగన్ ప్రకటిస్తారు.