కాకినాడ: చంద్రబాబు స్వార్థ రాజకీయాల వల్లే ప్రత్యేక హోదా కోసం ఆంధ్రరాష్ట్ర ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలుపు మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ నేతలంతా బంద్లో పాల్గొన్నారన్నారు. కాకినాడలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బంద్లో పాల్గొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని కేంద్రంతో చంద్రబాబు రాజీపడి అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడులను తీసుకొచ్చి సన్మానం చేశారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 10 సంవత్సరాలు హోదా ఇవ్వాలని రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు, కేంద్రంమంత్రిగా ఉన్న సమయంలో హోదా ముగిసిన అధ్యాయం అని మాట్లాడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం హోదాను తాకట్టుపెట్టారని, ప్రత్యేక హోదాను సాధించే వరకు వైయస్ఆర్ సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు.