హైదరాబాద్: చిత్తురు జిల్లాలో టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల ప్లెక్సీలు తొలగించారని, అయితే టీడీపీ నేతలు చంద్రబాబు బహిరంగ సభ పేరుతో తిరుపతిలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. శనివారం భూమన కరుణాకర్రెడ్డి ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియాను కలిశారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ను టీడీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. చిత్తూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైందన్నారు.ఎన్నికల కోడ్ అమలైనప్పటికీ టీడీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని సిసోడియా హామీ ఇచ్చినట్లు భూమన తెలిపారు.