రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బంద్ పిలుపు మేరకు ప్రజలు, పార్టీ శ్రేణులు కదం తొక్కారు. అన్ని జిల్లాల్లో ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు , వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతబడ్డాయి. పెట్రోల్ బంకులు, సినిమాహాళ్లు పనిచేయడం లేదు. వైసీపీ నేతలు,కార్యకర్తలు ఎక్కడిక్కడ బస్సు డిపోల వద్ద బస్సులను అడ్డుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. <br/>తెలవారుజాము నుంచే వైసీపీ నేతలు పెద్ద ఎత్తు వీధుల్లోకి వచ్చి బంద్ నిర్వహిస్తున్నారు. పలు చోట్ల రోడ్డుపై కబడ్డీ, క్రికెట్ ఆడుతూ నిరసన తెలుపుతున్నారు. కూడళ్లలో మానవహారం చేపట్టి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పార్టీనేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ బంద్ కు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.