మారుమోగిన మ‌హానేత నామస్మ‌ర‌ణ‌

- తెలుగు రాష్ట్రాల్లో  ఘ‌నంగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి వేడుక‌లు
- మ‌హానేత విగ్ర‌హాల‌కు పాలాభిషేకం
- ఆల‌యాల్లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు
- వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు
 
హైద‌రాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు ఆ మహానేత నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన మ‌హానేత జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొని నివాళుల‌ర్పించారు. ఇడుపులపాయలో జరిగిన జయంతి వేడుకల్లో వైయ‌స్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ, వైయ‌స్‌ జగన్‌ సతీమణి వైయ‌స్‌ భారతిరెడ్డి, సోదరి  షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని మ‌హానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 


హైద‌రాబాద్‌లో..
హైదరాబాద్‌లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు బొత్స సత్యనారాయణ, వైయ‌స్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సంక్షేమానికి వైయ‌స్‌ జగన్‌ మారు పేరని బొత్స కొనియాడారు. అనంతరం భారీ కేకును కట్‌ చేశారు. 


విజ‌య‌వాడ‌లో..
విజయవాడ పార్టీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా సమక్షంలో వైయ‌స్‌ఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మహానేత వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.   ఈ కార్యక్రమానికి వెల్లంపల్లి, మల్లాది విష్ణు, తోట శ్రీనివాస్‌, బొప్పన భవకుమార్‌, యలమంచిలి రవిలు హాజరయ్యారు. అనంతరం వన్ టౌన్ పంజా సెంటర్‌లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరులో నియోజకవర్గ కన్వీనర్‌ తానేటి వనిత ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌  జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

క‌ర్నూలులో..
కర్నూలు జిల్లా ఆత్మ‌కూరు స‌మీపంలోని ఇడుపుల‌పాయ‌లో మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కుమారుడు శిల్పా కార్తీక్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. కల్లూరు మండలం షరిన్‌ నగర్‌లో వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క‌ర్నూలు న‌గ‌రంలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేర్నకల్‌ సురేందర్‌ రెడ్డి, రాజా విష్ణు వర్ధన్‌ రెడ్డి, రాంభూపాల్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

అనంత‌పురం..
అనంతపురం జిల్లా, చెన్నేకొత్తపల్లిలో  వైయ‌స్ఆర్‌  జయంతిని ఆయన అభిమానులు, వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌  విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేశారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నాయకులు వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. రక్తదానం కార్యక్రమంలో పాటు రోగులకు పండ్లు అందజేశారు.


ప్ర‌కాశం..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం, చీమకుర్తిలో వైయ‌స్ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్‌ టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ఆ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మానసిక వికలాంగుల స్కూల్లో పండ్లు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, వైయ‌స్ఆర్‌  సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు
చిత్తూరులో వైయ‌స్‌ఆర్‌ జయంతి సందర్భంగా సిఎస్‌ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మ‌హానేత‌ అభిమానులు, కార్యకర్తలు భారీ కేక్‌ను కట్‌ చేశారు. గుంటూరు, సత్తెనపల్లిలో వైయ‌స్ఆర్‌ సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం, రైల్వేస్టేషన్ వద్ద మహిళకు చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. వినుకొండలో వైయ‌స్ఆర్‌ సీపీ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌  జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. వైయ‌స్ఆర్‌  చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేశారు.

 



Back to Top