<br/>అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాల్లోకనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాల్ని పరామర్శించి, వాళ్లకు స్థైర్యం కల్పించేందుకు ఉద్దేశించిన రైతు భరోసా యాత్ర మూడో దశ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోమొదలైంది. అక్కడ శెట్టూరులో ఏర్పాటైన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో రైతు సమస్యల మీద తాను మాట్లాడితే చంద్రబాబు..అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు. రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని, తనకు సన్మానాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారని వివరించారు. కానీ వాస్తవంలోచంద్రబాబు చేసిన దగాతోరైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వడ్డీ లేని రుణాలు వచ్చేవని, ఇప్పుడు 14 శాతం అపరాధ రుసుంతో కట్టాల్సి వస్తోందని ఆయన వివరించారు. జూన్ 30 లోపు సహకార రుణాలు రైతులకు అందేవని, ఇప్పుడు ఒక్క రూపాయి కూడా అందలేదని జగన్ చెప్పారు. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.