విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిరసనతో పాటు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు మొన్నటివరకూ హోదా కావాలన్నారని, అయితే ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రత్యేక హోదా వద్దంటున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు నాయుడు ఏపీని తాకట్టు పెట్టారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోనే 18 కేసుల్లో న్యాయస్థానాల నుంచి స్టేలు తెచ్చుకున్న సీఎం బాబు తప్ప ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్టేలపై న్యాయస్థానాలు పున:సమీక్ష చేయాలని వైయస్ అవినాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నీతిమంతుడైతే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు.<br/>వైఎస్ జగన్పై కేసుల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ ఆడిన పొలిటికల్ డ్రామా అని వైయస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాట కోసం నిలబడ్డారనే జగన్పై కేసులు బనాయించారని, వైయస్ రాజశేఖరరెడ్డి బతికున్నంతకాలం జగన్పై ఒక్క కేసు కూడా లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైయస్ఆర్ చనిపోయాకే కేసులు పెట్టారన్నారు. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ జగన్ ఏనాడు సచివాలయంలో అడుగు కూడా పెట్టలేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.