ప్రజలకు అండగా నిలుద్దాం

  • ముగిసిన జిల్లాల సమీక్షా సమావేశాలు
  • పార్టీ శ్రేణులకు గట్టు దిశానిర్దేశం 
  • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం
  • ప్రతీ ఒక్కరూ అధ్యక్షులు వైయస్ జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలి
  • వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
 
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారికి అండగా నిలిచి పరిష్కారం కోసం కృషి చేయాలని వైయస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  ప్రజలకు  భరోసా కల్పించాల్సిన సమయమిదేనని అన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో ఖమ్మం, మెదక్ జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 


సెప్టెంబర్ 2న జరిగే వైయస్సార్ వర్ధంతిపై ఇప్పటి నుంచి ప్రణాళికలు తయారు చేసుకోవాలని, అన్ని చోట్ల వర్ధంతి సభలు జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసిన తర్వాత విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 


ప్రతి జిల్లా, మండలంలో పార్టీ అనుబంధ సంస్థల కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, మతిన్, సేవాదశ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు సుధాకర్, ఐటీ విభాగం అధ్యక్షుడు బి. శ్రీవర్ధన్ రెడ్డి, పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకులు ఎం.జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 విజయవంతంగా ముగిసిన సమావేశాలు
జిల్లా విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర నాయకత్వం కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది. 250 మండలాల కమిటీలు ఏర్పాటు చేసినందుకు పలువురు నాయకులను అభినందించారు.  ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక మంది నాయకులు సమీక్షలో పాల్గొనటం విశేషం. పార్టీని గ్రామ స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలను అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకువచ్చి,  సలహాలు తీసుకున్నారు.
Back to Top