విజయవాడ) తెలుగునాట పచ్చ చొక్కాల రూపంలో కలియుగ కౌరవులు చెలరేగిపోతున్నారు. అందరినీ బెదిరించి భయపెట్టి పరిపాలన సాగిస్తున్నారు. తెలుగుదేశం అరాచక పాలనకు ఒక మహిళా తహశీల్దార్ ను జుట్టు పట్టి ఈడ్చేసిన ఘటన అద్దం పడుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవటమే ఆమె చేసిన నేరం. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిని అందరి ఎదుట ఈ రీతిలో అవమానించటం అంటే తెలుగుదేశం నాయకుల జోలికి వస్తే ఇంతే సంగతులు అని చాటిచెప్పటం అన్న మాట.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఇసుకను అక్రమంగా తవ్వించి అమ్ముకొంటున్నారు. అటుకేసి రెవిన్యూ సిబ్బందిని రానీయకుండా అడ్డుకొంటున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరు నుంచి ఇసుకను చింతమనేని వందలాది ట్రాక్టర్టలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు స్థానిక తహశీల్దార్ వనజాక్షి రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) మరియన్నను సంఘటానా స్థలానికి పంపించారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు అక్కడకు వెళ్లిన ఆర్ఐని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు అడ్డుకొని దౌర్జన్యం చేసి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షి సంఘటన స్థలానికి చేరుకుని ఇసుక రవాణాను ఆపాలని కోరారు. ఎమ్మెల్యే అనుచరులు ఖాతరు చేయకపోవడంతో వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. అక్కడి నుంచే కలెక్టర్, పోలీసులు ఉన్నతాధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని నేరుగా తహసీల్దార్ను దుర్భాషలాడారు. అనుచరులను ఉసిగొల్పారు. లాగి పక్కన పడేయంటూ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా మహిళా తహశీల్దార్పై దాడి చేశారు. ఆమెకు తీవ్రంగా గాయపరిచి ఇసుకలో లాగి పక్కన పడేశారు. దాడిని అడ్డుకున్న తహశీల్దారు కార్యాలయ సిబ్బందిని చితకబాదారు. దీన్ని చిత్రిస్తున్న స్థానిక పాత్రికేయుల్ని అడ్డుకొని చితకబాదారు. ఆ తర్వాత ప్రొక్లెయిన్తో ఇసుక తవ్వుకుని ట్రాక్టర్లలో యధేచ్ఛగా అక్రమంగా తరలించారు.ఒక మహిళా తహశీల్దార్ మీద పట్ట పగలు దాడి జరిగితే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. తెలుగుదేశం అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉండిపోయింది. చివరకు తహశీల్దార్ వనజాక్షి క న్నీళ్లు పెట్టుకొంటూ రోదించినా పట్టించుకొనే వారు లేకపోయారు. ఆత్మహత్య చేసుకోవటం మినహా తనకు దారి లేదంటూ ఆమె వాపోయారు. ఇటువంటి పాలనలో తాము విధుల్ని నిర్వర్తించలేమని, ఇంతకంటే అవమానం తమకు ఏమీ ఉండదని ఆమె వాపోయారు. ---