సీమాంధ్రను కాంగ్రెస్ నట్టేట ముంచింది

న్యూఢిల్లీ:

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, ‌అడ్డగోలుగా విభజించి సీమాంధ్ర ప్రాంత ప్రజలను నట్టేట ముంచి‌న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో పొత్తుల కోసం పాకులాడుతోందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకో పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలి‌సినా ఇంత దారుణానికి ఒడిగట్టిందని తూర్పారపట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో శ్రీ జగన్‌ శుక్రవారంనాడు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లారు.

‌అన్ని విధాలా అభివృద్ధి చెందిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని తీసేసుకుని కొత్త చోటుకు వెళ్లిపొమ్మంటున్నారని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త రాజధానికి ఎన్ని నిధులు ఇస్తారు? ఆ నిధులు ఎప్పుడు ఇస్తారు? అనే మాటే కేంద్రం ఎత్తటం లేదని ఆయన తప్పుపట్టారు. మిగులు ఆదాయం ఉన్న హైదరాబాద్‌ను తీసేసుకుంటే సీమాంధ్రకు ఏటా రూ. 15 వేల కోట్ల లోటు ఏర్పడుతుందని, కేంద్రం తొలి ఏడాది మాత్రమే భర్తీ చేస్తానని చెబితే ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఆ లోటు ఎలా తీరుతుందని శ్రీ వైయస్‌ జగన్ సూటిగా ప్రశ్నించారు.‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలా బతకాలని, జీతాలు ఎలా చెల్లించాలని ఆయన నిలదీశారు.

పార్లమెంటు ఉభయసభల్లో విభజన బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు న్యాయం చేసే ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఎండగట్టారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టు నిర్మాణం, కొత్త రాజధానికి నిధులు, కృష్ణా జలాల పంపిణీ తదితర అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసి, సీమాంధ్ర ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.

సీమాంధ్రను అన్నివిధాలా ఆదుకుంటామంటూ రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటనలోని అంశాలేవీ బిల్లులో పొందుపరుచకపోవటాన్ని శ్రీ జగన్ ప్రశ్నించారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలసిపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని ఈ విభజనతో రుజువు చేశారని ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరిని తూర్పారబట్టారు. అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదే‌శ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అన్యాయంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించిన తీరును చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

‘తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ‌ని వచ్చే ఎన్నికల్లోనే కాదు మరో వందేళ్లు రాష్ట్రంలో కాలు పెట్టనివ్వకుండా వారి పార్టీ కాళ్లను నరికేయాలి’ అని ప్రజలకు శ్రీ వైయస్‌ జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మరోమారు రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తామని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విభజన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు, మీడియా, సోషల్ మీడియా తమతో కలసిరావాలని చేతులు జోడించి ‌విజ్ఞప్తి చేశారు.

ఇకపై నియంత అంటే గుర్తుకు వచ్చేది సోనియా :
దేశ చరిత్రలో లేని విధంగా రాష్ట్రవిభజన చేశారని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు. దీనితో నియంత అంటే ఇకపై సోనియానే గుర్తుకొస్తారన్నారు. గురువారం రాజ్యసభలో అంతకు ముందు లోక్‌సభలో విభజన బిల్లును ఆమోదించిన తీరును చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. అసలు మనం భారతదేశంలో ఉన్నామా? అనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. విభజనకు వ్యతిరేకమని రాష్ట్ర అసెంబ్లీ నిర్మొహమాటంగా చెప్తూ బిల్లును తిప్పిపంపిందని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టరాదని అసెంబ్లీ చెప్పినా అప్రజాస్వామికంగా బిల్లును పార్లమెంటుకు తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. బిల్లు ప్రవేశపెట్టటానికి అంగీకరించాలని ఒకమారు, వ్యతిరేకించాలని మరోమారు సభ్యులను‌ మామూలుగా స్పీకర్ అడుగుతారన్నారు. దేనికి ఎక్కువ మంది చేతులు ఎత్తి చెబితే దాని ప్రకారం బిల్లు ప్రవేశపెట్టటానికి అంగీకారం దొరికిందని, లేకపోతే లేదని చెబుతారు. కానీ అవేమీ లేకుండా లోక్‌సభలో స్పీకర్‌ పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది దారుణమన్నా, వాకౌట్‌ చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

చీకట్లో చీల్చారు :
సీమాంధ్రకు చెందిన మొత్తం 15 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి తప్పించా‌రని శ్రీ జగన్‌ విమర్శించారు. ఇది చాలా దారుణమని, సీమాంధ్ర ప్రాంత ఎంపీలే లేకుండా 23 నిమిషాల్లో చర్చ పూర్తిచేసి బిల్లును ఆమోదించారని తూర్పారపట్టారు. లోక్‌సభలో జరిగిన సన్నివేశాలు బయటకు రాకుండా కేబుల్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి అంధకారంలో రాష్ట్రాన్ని విభజించా‌రని దుయ్యబట్టారు. ఇక రాజ్యసభలో సభ్యులు అడ్డుపడినా బిల్లుపై చర్చ జరిపిన ప్రభుత్వం అదే సభ్యులు అడ్డుపడుతున్నారని చెబుతూ బిల్లుపై డివిజన్, ఓటింగ్ జరుపలే‌దన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు, చర్చ జరిగిన తీరు చాలా బాధ కలిగించిందన్నారు. కేవలం ఆరుగురు సభ్యులు వెల్‌లోకి వచ్చి అడ్డుపడుతుంటే ఆ నెపం చూపించి డివిజన్, ఓటింగ్ పెట్టకుండా నెట్టుకొచ్చా‌రన్నారు. అదే ఆరుగురు సభ్యులు అడ్డుపడుతున్నపుడు చర్చను మాత్రం కొనసాగించారు. కానీ డివిజన్, ఓటింగ్‌కు వచ్చేసరికి ఆ ఆరుగురూ అడ్డుపడుతున్నారని డివిజన్ జరుగకుండా చేశా‌రన్నారు. దీన్ని నిరసిస్తూ సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ఇది అన్యాయమని వాకౌట్ చేసినా పట్టించుకోలే‌దని తూర్పారపట్టారు.

ఏ అంశంపైనా స్పష్టత ఇవ్వని ప్రధాని :
రాజ్యసభలో పేజీన్నర లేఖను చదివిన ప్రధానమంత్రి అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఆయన ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఒకటిన్నర పేజీ మాత్రమే చదివి ప్రసంగం ముగించారు. ఇది చూస్తే అసలు వీరు మనుషులేనా? అని బాధ కలుగుతోంది. రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. హైదరాబాద్ తీసేసుకుంటున్నారు. వేరే చోటికి వెళ్లిపొమ్మంటున్నారు. కొత్త రాజధాన్ని చూసుకోమంటున్నారు. కానీ కొత్త రాజధానికి ఎంత డబ్బిస్తున్నారు? అక్కడి జనం ఎలా బతుకగలుగుతారు? ఎన్ని రోజుల్లో డబ్బులు ఇస్తారు? అనే ప్రస్తావన ఏదీ లేదు. ఇది న్యాయమేనా?

ప్రతి ఏటా పెరిగే లోటును ఎలా భర్తీ చేస్తారు?
హైదరాబాద్ తీసేస్తే సీమాంధ్రలో ప్రతి ఏటా రూ. 15 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది. ఇంతలోటు ఉంటే జీతభత్యాలు సైతం ఇవ్వని పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసీ ప్రతి ఏటా ఇంత లోటును ఎలా భర్తీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. కేవలం తొలి ఏడాది మాత్రం లోటును భర్తీ చేస్తామని ప్రధాని లేఖలో చెప్పారు. ఒక్క ఏడాది మాత్రమే రెవెన్యూ లోటును భర్తీ చేస్తే.. ఆ తర్వాత ప్రతి ఏటా లోటును ఎలా భర్తీ చేస్తారు? ప్రతి ఏటా 14 శాతం లోటు పెరుగుతూ పోతుంది. ఒక ఏడాది రెవెన్యూ లోటును ప్రస్తావిస్తే మిగతా లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పే నాథుడే లేడు. జీతాల కోసం మేము ఎక్కడికెళ్లాలి? ఎక్కడ తిరగాలి?

ఐదేళ్ల ప్రత్యేక ప్యాకేజీతో ఎవరికి మేలు?
సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టాలంటే కనీసం మూడు నుంచి ఐదేళ్లు పడుతుందని, అలాంటిది ప్రత్యేక ప్యాకేజీ ఐదేళ్లకు పరిమితం చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ ప్యాకేజీతో ఎవరికి మేలు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై అడిగేవారు లేరన్నారు. అడిగినా పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 15 ఏళ్లయినా ఈ ప్యాకేజీ  ఇవ్వకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. సభలో ప్రస్తావించిన ప్యాకేజీ అంశాలు బిల్లులో ఎక్కడ ఉన్నాయని నిలదీశారు.

రైతులు నీటి కోసం కొట్టుకుని చావండంటారా?:
నదీ జలాల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు నిధులకు సంబంధించి కేంద్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని శ్రీ వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఇష్టారీతిగా విభజన చేసేసి మీ చావు మీరు చావండన్న ధోరణిలో కేంద్రం వ్యవహరించిందని దుయ్యబట్టారు. నీళ్లకు సంబంధించి కృష్ణా ఆయకట్టుపై తెలంగాణలోని రెండున్నర జిల్లాల రైతులు, సీమాంధ్రలోని ఎనిమిదిన్నర జిల్లాల రైతులు ఆధారపడి ఉన్నారన్నారు. నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర అవసరాలు తీరాక, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా‌మ్‌లు నిండితే తప్ప నీరు కిందకు రాని పరిస్థితి ఉంది. వీటిపై ట్రిబ్యునళ్లు, వాటర్ బోర్డులు ఉండగానే నీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీరెక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. నో ట్యాంపర్ జోన్ పెట్టాలన్న ఇంగితజ్ఞానం లేదు. ఇక పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకు ఇన్ని నిధులు ఇస్తున్నామన్న మాటే లే‌దని విమర్శించారు. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజె‌క్టు చాలా ముఖ్యం అన్నారు.

నాయకుడంటే చిచ్చుపెట్టేవాడా?:
'పార్లమెంటులో పెట్టిన బిల్లు అన్యాయంగా ఉందని సాక్షాత్తూ చంద్రబాబు అంటున్నారని, సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు బిల్లు అన్యాయంగా ఉంది, వ్యతిరేకిస్తాం అన్నారు. అదే పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావు, రమేశ్‌రాథోడ్‌ లోక్‌సభలో బిల్లు చాలా బాగుందని చెప్పి ఓటు వేస్తారు. మొదటి ఓటు తామే వేశామని చెప్పుకుంటారు. రాజ్యసభలోనూ అంతే. ఒకవైపు బిల్లు బాగోలేదని చెప్పిస్తారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలు దేవేందర్ గౌడ్‌,  గుండు సుధారాణి బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారు. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు పెంచడం నాయకత్వమా?' అని శ్రీ జగన్‌ విమర్శించారు.

Back to Top