బాబు అబద్ధపు హామీలను ఎండగడదాం


ఒంగోలు, నవంబరు 24: అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును ఎండగడదాం... టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిద్దాం... మనకు ఓట్లేసిన ప్రజలకు అండగా నిలుద్దామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఐదో తేదీన అన్ని కలెక్టరేట్ల ఎదుట జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేయడమే లక్ష్యంగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆయన సోమవారం ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల సమీక్షలను ప్రారంభించారు. తొలిరోజు కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు, చీరాల, పర్చూరు నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలు చెప్పిన విషయాలను శ్రీ వైఎస్ జగన్ ఆసాంతం విన్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలను కలసికట్టుగా ఎదిరిద్దామంటూ మనోధైర్యం నింపారు.

ఏ ప్రభుత్వానికైనా ప్రజల్లో అసంతృప్తి మూటగట్టికోవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ఆరు నెలలు తిరగకుండానే చంద్రబాబునాయుడు మాకు వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేక పవనాలు వీచిన రాష్ట్రం దేశంలోనే లేదన్నారు. మనం కూడా ప్రజల సమస్యలపై ప్రతిపక్షంగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

మన పార్టీ అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోయే విధంగా పాలన అందించాలని అనుకున్నాను. నాన్న ఫొటో పక్కన ప్రతి ఇంట్లో నా ఫొటో కూడా ఉండాలని భావించాను. అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేదు. అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లనే చంద్రబాబు గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఆయన ఎలా మోసం చేశాడో చెబుతాడు.

2012 కడప పార్లమెంట్ ఎన్నికలో నేను పోటీ చేసినపుడు నాకు వచ్చిన మెజారిటీ 5.45 లక్షలు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడి కూటమికి, మనకు ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినపుదు ఇది పెద్ద తేడా కాదు. చంద్రబాబు ఇచ్చినట్లుగా మనం కూడా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవి. ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక్క కోరికతో అడ్డమైన అబద్ధాలు చెప్పిన ఘనత చంద్రబాబునాయుడిదే.

రుణమాఫీకి రూ. 5 వేల కోట్లా?

రైతు రుణమాఫీకి బడ్జెట్ లో కేవలం రూ. 5 వేల కోట్లు కేటాయించారు. దీంతో 20శాతం రుణం మొదటి దశలో మాఫీ చేస్తానని చెప్పారు. రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లుంటే, డ్వాక్రా రుణాలు రూ.14 వేల కోట్లున్నాయి. మొత్తం కలిపితే రూ. 1.01 లక్షల కోట్లు. చంద్రబాబు మాట విని రైతులు వడ్డీ కట్టకపోవడంతో అపరాధ వడ్డీ కింద మరో 14 శాతం వడ్డీ భారం మరో రూ. 14 వేల కోట్లు. ఈ ఏడాది ఐదు వేల కోట్లే బడ్జెట్ కేటాయింపు ఉండటంతో వచ్చే ఏడాదికి ఈ వడ్డీ రూ. 28 వేల కోట్లకు చేరుతుంది. అసలు సంగతి దేవుడెరుగు వడ్డీ కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది.

గ్రామాల్లో అవ్వతాతల పెన్షన్ల విషయంలో కూడా మోసం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల 11 వేల పెన్షన్లు ఉన్నాయి. వాటిని వెయ్యి రూపాయలు చేస్తే నెలకు రూ. 431 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 3,700 కోట్లు ఖర్చవుతుంది. అయితే బడ్జెట్ కేటాయింపులో మాత్రం కేవలం రూ. 1338 కోట్లు మాత్రమే పెట్టారు. అంటే అవ్వతాతల పెన్షన్లలో కూడా రూ. 2,400 కోట్లు కోతవేశారు. అసలు ఈ మనిషికి మానవత్వం ఉందా?

ఈ పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవి9 భాగస్వామ్యం

ఇంత మోసం చంద్రబాబు ఒక్కడే చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలసి ఈ మోసపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఐదేళ్ల తర్వాత కూడా వీరు చంద్రబాబును మోస్తారు. చంద్రబాబు మంచివాడే ఆర్బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటూ ప్రచారం చేస్తారు. చంద్రబాబు మాదిరిగా మనకు తోడుగా మోసపూరిత పత్రికలు, ఛానళ్లు లేవు. అయినా మనకు ఉన్నది చంద్రబాబుకు లేనిది దేవుని దయ. దేవుడు ఇంతమంది ప్రజల్లో పుట్టించిన ప్రేమానురాగాలను తోడుగా తీసుకొని రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు వెళ్దాం. చంద్రబాబు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని ప్రజలకు చెబుదాం.

ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, మేరుగ నాగార్జున, తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్ రెడ్డి, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, జంకె వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాచిన చెంచు గరటయ్య, బాపట్ల పార్లమెంట్ ఇంచార్జి వరికూటి అమృతపాణి, ఇతర నియోజకవర్గాల ఇంచార్జులు, బుర్రా మధుసూదన్ యాదవ్, గొట్టిపాటి భరత్, యడం బాలాజీ, పార్టీ నేతలు కేవీ రమణా రెడ్డి, కుప్పం ప్రసాద్, వై. వెంకటేశ్వరరావు, కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top