దెయ్యాలు వేదాలు వల్లించినట్లు సోమిరెడ్డి వ్యాఖ్యలు


హత్యారాజకీయాలు చేసేది టీడీపీ ఒక్కటే
ప్రభుత్వ డొల్లతనం ప్రశ్నిస్తే అది రౌడీయిజమా..?
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తికి వైయస్‌ జగన్ను విమర్శించే అర్హత లేదు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు

విజయవాడ: దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల చేత తిరస్కరించబడిన వ్యక్తి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌పై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. జమ్మలమడుగులో హత్యారాజకీయాలు చేసే మంత్రిని పక్కనబెట్టుకొని సోదిరెడ్డి నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కాంట్రాక్టుల కోసం జమ్మలమడుగులో టీడీపీ నేతలు కొట్టుకోవడం.. అనంతపురంలో పరిటాల సునీత వర్గీయులు వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త శివారెడ్డిని హత్యచేయడం.. ఒక ఐపీఎస్‌ అధికారిని రోడ్డుపై నిలబెట్టి దాడి చేయడాన్ని హత్యా రాజకీయాలు, రౌడీ రాజకీయాలంటారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినన్ని హత్యలు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదన్నారు.  ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యల గురించి పోరాడుతూ.. ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రశ్నిస్తే అది రౌడీయిజం ఎలా అవుతుంది సోమిరెడ్డి అని ప్రశ్నించారు. వ్యవసాయం గురించి తెలియని వ్యక్తిని ఆ శాఖకు మంత్రిని చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌ను తిట్టేందుకు మాత్రమే చంద్రబాబు సోమిరెడ్డిని మంత్రిని చేశారన్నారు. 
Back to Top