మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సమైక్య తీర్మానానికి అనుమతించండి
09 Jan 2014 12:39 PM
హైదరాబాద్:
‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయటానికి అనుమతించండి లేదా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై నేరుగా ఓటింగ్ నిర్వహించండి’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినపుడే రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల ఆకాంక్ష ఏమిటో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీమతి విజయమ్మ బుధవారంనాడు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు లేఖ రాశారు.
విభజన బిల్లుపై ముందే ఓటింగ్ పెడితే అది ఆమోదం పొందినా లేదా వ్యతిరేకించినా తద్వారా మెజారిటీ ప్రజల ఉద్వేగం, ఆకాంక్ష వెల్లడవుతుందని ఆ లేఖలో శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ఒకవేళ మెజారిటీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తే దాన్నే రికార్డు చేసి రాష్ట్రపతికి పంపించాలని కోరారు. ఈ విషయంలో శాసనసభ 359 నిబంధన మేరకు స్పీకర్కు సర్వాధికారాలు ఉన్నాయన్నారు.
స్పీకర్కు శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ సారాంశం ఇదీ :
బిల్లును పూర్తిగా తిరస్కరించవచ్చు :
‘రాజ్యాంగంలోని మూడవ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013పై అభిప్రాయాలు తెలపాలంటూ రాష్ట్ర అసెంబ్లీకి పంపారు. గడచిన 57 ఏళ్ల రాష్ట్ర శాసనసభల చరిత్రలో తొలిసారిగా వచ్చిన ఇలాంటి బిల్లుపై ఉభయ సభల్లోనూ అభిప్రాయాలు వెల్లడించడం తప్ప ఇతరత్రా ఎలాంటి అధికారాలు లేవు. ఈ బిల్లును మూజువాణి ఓటు ద్వారా గానీ, ఓటింగ్తో గానీ శాసనసభ, మండలి మొత్తంగా తిరస్కరించే అవకాశం ఉంది. శాసనసభలోని 359, 360, శాసనమండలిలోని 326, 327 నిబంధనలను అనుసరించి స్పీకర్కు, చైర్మన్కు ఆయా అంశాల ప్రాధాన్యతను అనుసరించి తాము సబబు అని భావించేలా ఇలాంటి బిల్లులపై ముందుకు వెళ్లవచ్చు.
ఆ రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ జరగలేదు :
ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినపుడు ఎలాంటి పద్ధతులు అనుసరించారనే అంశంపై స్పీకర్ అధ్యయనం చేశారని సమాచారం ఉంది. ఆ రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు మన రాష్ట్రంలో సందర్భోచితంగా ఉండవు. ఎందుకంటే.. ఆ రెండు రాష్ట్రాల విభజన జరిగింది సంబంధిత అసెంబ్లీలు ముందుగానే విభజనను అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన తర్వాతే రాష్ట్రపతి నుంచి అభిప్రాయం కోరుతూ బిల్లులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదు. ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించిన విధానం ఇక్కడ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మనవి చేస్తున్నాం.
కారణాలు, ఉద్దేశాలు లేని బిల్లుపై తొందరెందుకు? :
రాజ్యాంగంలోని మూడవ అధికరణ కింద ఏర్పాటైన రాష్ట్రాలన్నింటికీ ఒక ప్రాతిపదిక ఉంది. రాష్ట్రాల పునర్విభజన కమిటీ లేదా, జేవీపీ కమిటీ, దార్ కమిటీ, వాంఛూ కమిటీల సిఫారసులను అనుసరించి గానీ, సంబంధిత రాష్ట్రాల నుంచి విభజనకు తీర్మానం అందిన తరువాత గానీ ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా 8.5 కోట్ల మంది ప్రజల జీవితాలకు, వారి ఉపాధికి సంబంధించిన ఇంత ముఖ్యమైన బిల్లును కేంద్ర మంత్రివర్గం సాదా సీదాగా టేబుల్ ఐటమ్గా ఆమోదించి పంపినపుడు మనం దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి ఎందుకంత తొందరపాటును ప్రదర్శించాలి? బిల్లు ఉద్దేశాలు గానీ, కారణాలు గానీ లేకుండా క్లాజులకు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు, సమాచారం ఏదీ లేకుండా వచ్చిన దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? ఇది మమ్మల్ని, తమ ప్రతినిధులుగా ఈ పవిత్ర సభకు పంపిన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కాదా?
స్పీకర్కు విచక్షణాధికారాలు ఉన్నాయి :
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ 77, 78 నిబంధనల కింద రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి మేమిచ్చిన నోటీసుకు సమ్మతించండి. లేదా విభజన బిల్లుపై నేరుగా ఓటింగ్ నిర్వహించండి. అపుడు సభలో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆరంభంలోనే బిల్లుపై మెజారిటీ ప్రజల వ్యతిరేకత, ఆగ్రహం తెలియడానికి ఆస్కారం ఉంటుంది.
ఒకవేళ మెజారిటీ సభ్యులు రాష్ట్ర విభజనకు అంగీకరించకపోతే దానినే రికార్డు చేసి రాష్ట్రపతికి బిల్లును తిప్పి పంపండి. 359 నిబంధన కింద స్పీకర్ తాను సముచితం అనుకున్న తీరులో వ్యవహరించటానికి విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఇక్కడ మా ప్రయత్నం ఏమంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడానికే అన్నది మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను.’