అనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ కారిడార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆ ప్రజాదరణను జీర్ణించుకోలేక మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వైయస్ జగన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రి పయ్యావుల కేశవ్ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి విషయంలోనూ ఆయన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును వైయస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, టీడీపీ నేతలు దానిని తమ ఖాతాలో వేసుకుంటున్నారని అన్నారు. అలాగే వైయస్ఆర్ చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగడునా అడ్డుపడ్డారని ఆరోపించారు. టీడీపీ నేత దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నాలు చేయించి ప్రాజెక్టులను అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం దుర్మార్గమని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రజల అభివృద్ధిని అడ్డుకునే చర్యలను ఇక ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు.