మీ కుంభకోణాలపై విచారణకు సిద్ధమా బాబూ?

శ్రీకాకుళం :

చంద్రబాబు తొమ్మిదేళ్ల రాక్షస పాలన ప్రజలందరికీ తెలుసని, ఆయన దుష్ట పరిపాలనలో అన్నీ కుంభకోణాలే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిప్పులు చెరిగారు. బెల్టుషాపులు, ఏలేరు స్కాం, తెల్గీ, నీరు-మీరు, ఐఎంజీ, ఎమ్మార్ ఇలా వరుస కుంభకోణాలతో చంద్రబాబు పరిపాలన సాగించారన్నారు. వీటిపై విచారణల నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాల నుంచి సుమారు 18 స్టేలు తెచ్చుకుని బతుకుతున్నారని.. ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ కుంభకోణాలపై విచారణకు చంద్రబాబు సిద్ధమేనా..? అని శ్రీమతి విజయమ్మ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లా పోలాకి, వడ్డితాండ్ర, శ్రీకూర్మం, శ్రీకాకుళం, చిలకపాలెంలో నిర్వహించిన సభల్లో మాట్లాడారు.

'చంద్రబాబూ..‌ నువ్వు ఏ తప్పూ చేయకపోతే, నాయకత్వ లక్షణాలుంటే కోర్టుల్లో స్టేలు తొలగింపజేసుకొని నేరుగా విచారణను స్వీకరించాల‌'ని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు హయాంలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనుషులకు తిండి లేదు. ఆఖరికి పశువులకు కూడా మేత లేదు. వలసలు, ఆత్మహత్యలు, అప్పులు.. ఇలా అన్నీ అవస్థలే' అని ఆవేదన వ్యక్తంచేశారు.

'ఇక టీడీపీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడయ్యాడు. ఎన్టీఆర్ పెట్టిన 2 రూపాయలకే కిలోబియ్యం, మద్య నిషేధం, రైతులకు 50 రూపాయలకే ఒక హా‌ర్సు పవర్ విద్యు‌త్ పథకా‌లు ఎత్తేశాడు’ అని ఆమె దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆల్‌ ఫ్రీ అంటూ ఇస్తున్న అడ్డగోలు వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దన్నారు. ఐదేళ్లపాలనలో రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాను గుర్తుపై ఓటేసి వైయస్ఆర్‌సీపీని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. జగన్‌బాబు సీఎం కాగానే ఐదు సంతకాలతో రాష్ట్రం దశదిశ మారుస్తారని శ్రీమతి విజయమ్మ ఓటర్లకు భరోసా ఇచ్చారు.

Back to Top