అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

అనంతపురం రూరల్ః అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బాధితులతో కలిసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్‌ సంస్థ చేసిన మోసంతో రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకుండి పోవడం వెనుక అంతర్యమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే విలువైన ఆస్తులను కారుచౌవకగా ప్రభుత్వ పెద్దలు కొట్టేసుకున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌సంస్థ ఆస్తులను జప్తు చేసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పటికే 120మంది బాధితులు ఆత్మహత్య చేసుకొని బలవన్మరణం పొందారని గుర్తు చేశారు. ఈ ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనన్నారు. అగ్రిగోల్డ్‌ఖాతారుల వివరాలను వారికి రావాల్సిన మొత్తాలను వెంటనే ఆల్‌లైన్‌లో పొందుపరచడంతోపాటు సంస్థ మేనేజింగ్‌డైరెక్టర్ల అందరిని అదుపులోకి తీసుకొని వారి కుటుంబ సభ్యల ఆస్తులను జప్తు చేయాలన్నారు. రియల్‌ఎస్టేట్‌వెంచర్లలో స్థలాలను కొనుగోలు చేసిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్‌చేయించాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. లేని పక్షంలో అగ్రిగోల్డ్‌బాధితుల పక్షాన వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌బాధితులు రంగారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్‌రహిమాన్, వైఎస్సార్‌సీపీ నాయకులు గుగ్గిళ్ల జయక్రిష్ణారెడ్డి, క్రిష్ణమోహన్‌తదితరులు పాల్గొన్నారు.

Back to Top