షర్మిల పాదయాత్ర 43వ రోజు సాగేదిలా

మహబూబ్‌నగర్‌, 28 నవంబర్‌ 2012: షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం మహబూబ్‌నగర్‌ జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానికి వత్తాసు పలుకుతున్న టిడిపి తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆయన సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర గురువారంనాటికి 43వ రోజుకు చేరుతుంది.

గురువారం ఉదయం షర్మిల నెట్టెంపాడు ప్రాజెక్టు వద్ద నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ ఎడ్మ కిష్టారెడ్డి‌ ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్రలో భాగంగా షర్మిల నెట్టెంపాడు రిజర్వాయర్‌ను సందర్శిస్తారని తెలిపారు. అక్కడి నుంచి బయలుదేరి వామనపల్లి మీదుగా నడిచి నర్సందొడ్డి చేరుకుంటారన్నారు. నర్సందొడ్డిలో షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం పాదయాత్ర మొదలుపెట్టి జూరాల డ్యాం వద్దకు చేరుకుంటారని పేర్కొన్నారు. జూరాల డ్యాం మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగించి నందిమళ్ళ చేరుకుంటారని వారు వివరించారు. అనంతరం మూలమళ్ళకు ముందు జాతీయ రహదారి వరకూ పాదయాత్ర చేస్తారన్నారు. రాత్రికి అక్కడ షర్మిల బస చేస్తారని తెలిపారు. కాగా, షర్మిల గురువారంనాడు 17.5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారని పేర్కొన్నారు.
Back to Top