షర్మిల మోకాలికి శస్త్రచికిత్స

యాంజాల్(రంగారెడ్డి జిల్లా): మోకాలికి గాయమైనప్పటికీ, తీవ్రమైన నొప్పిని భరిస్తూ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను నాలుగు కిలోమీటర్ల పాటు సాగించిన  దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం శస్త్ర చికిత్స చేస్తారు.  గాయం తీవ్రత ఊహించినదానికంటే ఎక్కువగా ఉందనీ, శస్త్రచికిత్స అత్యవసరమనీ పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు.  అనంతరం కనీసం మూడు వారాలు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. షర్మిల కోలుకోగానే తిరిగి రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ నుంచే పాదయాత్రను కొనసాగిస్తారని పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వెల్లడించారు. వాస్తవానికి మంగళవారం ఉదయమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పగా.. అన్న శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డిని చూశాకే ఆపరేషన్ చేయించుకుంటానని శ్రీమతి షర్మిల పట్టుబడుతున్నారన్నారు. దీంతో మంగళవారం ఉదయం జైలుకు వెళ్లి అన్నను కలిసి వచ్చాక మధ్యాహ్నం శస్త్రచికిత్స చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు.

రెండు రకాల గాయాలు..

     శ్రీమతి షర్మిలకు ఆదివారం చేసిన ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులు సోమవారం అందాయి. వాటిని పరిశీలించిన వైద్యులు.. ఊహించినదానికంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. మోకాలిలో రెండు రకాల గాయాలయ్యాయని నిర్ధారణకొచ్చారు. మోకాలిలో ‘లేటరల్ మెనిస్కస్’ భాగం కొంత మేర తెగిపోయి పాడైందనీ, దాన్ని తొలగించి మిగతా భాగాన్ని బాగుచేయాల్సి ఉందని ఆర్థోపెడిక్ వైద్యులు సోమశేఖరరెడ్డి, రఘువీరారెడ్డి, శివభారత్‌రెడ్డి తెలిపారు. ఇక మీడియల్ కొల్లేటరల్ లిగమెంటుకు పాక్షిక గాయమైందని, అది అతుక్కోవడానికి కనీసం మూడు వారాలు పడుతుందని చెప్పారు. అత్యవసరంగా శ్రస్త్ర చికిత్స చేయాలని, లేకుంటే నొప్పి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. 

     మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అపోలో ఆసుపత్రిలో కీ హోల్ పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహిస్తామన్నారు. శస్త్ర చికిత్సకు సుమారు ఒక గంట సమయం పడుతుందనీ, బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వారు చెప్పారు. ఆపరేషన్ అనంతరం కాలుకు సిమెంటు పట్టీ వేస్తామని, ఈ పట్టిని కనీసం మూడు వారాలు తీయకుండా ఉంచాలన్నారు. కనీసం మూడు వారాలకు పైగా విశ్రాంతి తీసుకుంటేనే దెబ్బతిన్న లిగమెంటు తిరిగి పూర్వపు స్థితికి వస్తుందని ఆయన చెప్పారు. మూడు వారాల తర్వాత పట్టీ విప్పి పరిస్థితిని సమీక్షించాక.. మరింత కాలం విశ్రాంతి అవసరమా లేదా అన్నది చెప్తామన్నారు. 

భారీగా తరలివచ్చిన అభిమానులు

     సోమవారం శ్రీమతి షర్మిల జన్మదినం కావడంతో ఆమె బస చేసిన ప్రాంతానికి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు బారులు తీరారు. నడిచేందుకు కాలునొప్పి సహకరించకపోయినా ప్రజల ఆకాంక్ష మేరకు వాహనంపై ఉన్న రెడీమేడ్ వేదిక మీదకు ఎక్కి ఆమె కేక్ కోశారు. తన కోసం వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి షర్మిల జన్మదినం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్సు సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. శ్రీమతి షర్మిలను పరామర్శించిన వారిలో వైయస్ వివేకానందరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బి. జనార్ధన్, దేప భాస్కర్ రెడ్డి, గోనె ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

Back to Top