సమైక్యమే మా వైఖరి : మమతా బెనర్జీ

కోల్‌కతా , 20 నవంబర్ 2013:

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని, ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించడం సరికాదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆమె సంఘీభావాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ‌అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రయత్నాలను పార్లమెంట్‌లో అడ్డుకుంటామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. విభజన విషయంలో ఒక విధానం పాటించకుండా రానున్న ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని చూస్తే లోక్‌సభ, రాజ్యసభలోనూ అడ్డుకుంటామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి‌ ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటినీ వరుస క్రమంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి వివరించినప్పుడు మమతా బెనర్జీ పైవిధంగా స్పందించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ, కాంగ్రె‌స్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడదీయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగడు‌తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయంలోని ‌సీఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గంటకుపైగా చర్చలు జరిపారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ప్రతినిధులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, వి.బాలశౌరి, గట్టు రామచంద్రరావు మమతా బెనర్జీతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందాన్ని ఆత్మీయంగా పలకరించిన మమతా బెనర్జీ విభజన అంశంపై శ్రీ జగన్ చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా విన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని‌ శ్రీ జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె అభినందించారు. ఈ విషయంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీల ‌నాయకులనూ కలిసి వివరించాలని సూచించారు.

కేంద్రం వైఖరిని తూర్పాపట్టిన జగన్‌ :
ఆంధ్ర రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నదీ, నిరంకుశ వైఖరితో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రికి శ్రీ జగన్ వివరించారు. ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని తెలిపారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితేనే రాష్ట్రాన్ని విలీనం చేయాలన్న ఫ‌జుల్ అలీ కమిష‌న్ సిఫారసులను వివరిస్తూనే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ (ఎస్‌ఆర్‌సీ) సిఫారసు ఆధారంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని వివరించారు. ‘అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి ప్రాతిపదిక లేకుండా నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ‌ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. ఆ తర్వాతే వాటిని విభజించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ‌అలాంటి సంప్రదాయం పాటించలేదు’ అని శ్రీ జగన్ వివరించారు.

‘రాజ్యాంగంలోని 3వ అధికరణ ఉంది కదా అని కేంద్రం‌ తన ఇష్టానుసారం విభజన చేయాలనుకుంటోంది. ఈ అధికరణ దుర్వినియోగం కావడాన్ని అడ్డుకోవడంలో మీరు అండగా నిలవాలి’ అని శ్రీ జగన్ కోరారు. మమతా బెనర్జీ స్పందిస్తూ తాము కచ్చితంగా మద్దతునిస్తామని ప్రకటించారు. ‘అభివృద్ధి చేయాలంటే.. డార్జిలింగ్ మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వ‌వచ్చు, ప్యాకేజీలు, నిధులు కేటాయిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది కాని, విభజిస్తే అభివృద్ధి జరుగుతుందా!’ అని ఆమె చర్చల సందర్భంగా అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగం చేస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ను సవరించాలని, రాష్ట్రాల విభజన విషయంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లలో 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదించడం తప్పనిసరి చేయాలన్న తమ కృషికి మద్దతుగా నిలవాలని కోరారు.

మమతా దీదీ సాయం కోరాం- జగన్‌ :
సమావేశం అనంతరం.. ముందు శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే కుదరదని‌ అన్నారు. విభజనకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన తెలిపారు. మమతా బెనర్జీతో సమావేశం అనంతరం శ్రీ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకునేందుకు సాయం చేయా‌లని ఆమెను కోరామన్నారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేస్తూ ఆర్టికల్‌ 3ను సవరించాలని, విభజనకు 2/3 వంతు మెజారిటీ ఉండాల్సిందేనని పట్టుపడుతున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు రెండింటిలోనూ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదించినపుడే రాష్ట్రాన్ని విభజించాలని, లేదంటే ఓట్ల కోసం, సీట్ల కోసం.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా అడ్డగోలుగా ఏ రాష్ట్రాన్నైనా ఇట్టే విభజిస్తుందని శ్రీ జగన్ అన్నారు. తమ పోరాటానికి సంఘీభావం తెలిపిన మమతా బెనర్జీకి శ్రీ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశం సమైక్యంగా ఉండాలనే తాను
ఎప్పుడూ కోరుకుంటానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రజలంతా కలిసికట్టుగా
ఉండాలన్నదే తమ అభిమతం అన్నారు.‌ ఐదేళ్లుగా మాట్లాడకుండా ఊరుకుని ఇప్పుడు
ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజిస్తున్నారని ఆమె
నిలదీశారు. అభివృద్ధి నెపంతో విభజిస్తూ పోతే సమస్య పరిష్కారం కాదని మమతా
బెనర్జీ అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ
వైయస్ జగన్మోహన్‌రెడ్డి తన తమ్ముడి లాంటి వారని ఆమె అన్నారు.‌

తెలంగాణ అంశంపై ఇప్పటికే అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇంతవరకూ పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని మమతా బెనర్జీ అన్నారు. సమస్యను సవివరంగా చర్చించాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ, సర్కారియా కమిషన్‌ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాజకీయ లబ్ఢి కోసం ఏదో ఒక బిల్లును తీసుకువచ్చే బదులు శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టమని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. విభజన విషయంలో తమ రాష్ట్రంలో కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయని, ఈ విషయంలో తమ వైఖరి సుస్పష్టం అన్నారు.

అభివృద్ధి కావాలంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవచ్చని.. లేదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చని మమతా బెనర్జీ తెలిపారు. లేదా అంతా కలిసి విభజిద్దామని నిర్ణయం తీసుకుని తీర్మానం ఆమోదిస్తే దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరని మమతా బెనర్జీ అన్నారు. ఉదాహరణకు జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఏర్పాటుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయని, పార్లమెంటులో కూడా 2/3 కన్నా ఎక్కువ మెజార్టీతో ఒప్పుకున్నారని ఆమె గుర్తుచేశారు.  కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చాలా సున్నితమైన అంశమని, ఒకరు విభజన కావాలంటుంటే, మరొకరు వద్దంటున్నారని మమతా బెనర్జీ అన్నారు.

ఎన్నికలు కొన్ని నెలల్లో ఉన్నాయనగా రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్ళ క్రితం ఇలాంటి విధానానికే పాల్పడిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారన్నారు.

Back to Top