ప్ర‌జా ప్ర‌స్థానం ఒక మైలు రాయి

హైదరాబాద్: ఆంధ్రప్ర‌దేశ్ చ‌రిత్ర‌ను మ‌లుపుతిప్పిన ఒక మ‌హా ఘ‌ట్టానికి నేటితో ప‌ద‌మూడేళ్లు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం కు శ్రీకారం చుట్టి నేటితో 13 సంవ‌త్స‌రాలు అవుతోంది. స‌రిగ్గా ఇదే రోజున అంటే 2003, ఏప్రిల్ 9 వ తేదీన ఈ యాత్ర‌ను ప్రారంభించారు.  చంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌తో విసిగిపోయి, త‌మ‌ను ఆదుకొనే దిక్కు ఎవ‌రూ అని  ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి ఈ పాద‌యాత్ర‌ను సంక‌ల్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే అది ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో ప‌ర్య‌టించారు. అలుపెర‌గ‌ని రీతిలో జ‌రిగిన ఈ యాత్ర‌లో అనేక‌మంది దివంగత మ‌హానేత తో మ‌మేకం అయ్యారు. 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని ప‌ల‌క‌రిస్తూ, నేనున్న ఆంటూ భరోసా ఇస్తూ  వైఎస్ రాజశేఖరరెడ్డి సాగించిన ఈ యాత్ర దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

పాద‌యాత్ర‌లో చూసిన ఇబ్బందులు, సాధ‌క‌బాధ‌కాల్ని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌దా గుర్తించుకొన్నారు. అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరిపోయేలా ప‌థ‌కాలు రూపొందించారు. వ్య‌వ‌సాయానికి  ఉచిత విద్యుత్ ఇచ్చారు. నిరుపేద‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, 104 వాహ‌నాలు స‌మ‌కూర్చారు. మ‌హిళ‌ల కోసం  డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించారు. వ్య‌వ‌సాయ దారుల‌కు జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల్ని సంక‌ల్పించారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సువ‌ర్ణ‌యుగం అన‌ద‌గ్గ పాల‌న‌కు ఈ ప్రజా ప్ర‌స్థానం యాత్ర నాంది ప‌లికింది. 
Back to Top