హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం


చంద్రబాబు తన స్వార్థం కోసం ప్యాకేజీని అంగీకరించాడు
హోదా కోసం పోరాడే ప్రతీ పార్టీని కలుపుకొని పోతాం
బాబు సంస్కృతిని లోకేష్‌ ఫాలో అవుతున్నాడు
నరేగ ఫండ్స్‌ను అడ్డుకుంటున్నారని ప్రతిపక్షంపై ఆరోపణలు
లోకేష్‌పై లోక్‌సభ, అంసెబ్లీ స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తాం
ప్రజా సంకల్పయాత్ర చూసి బాబు వెన్నులో వణుకు

ఒంగోలు: చంద్రబాబు తన స్వార్థం కోసం ఆంధ్రరాష్ట్ర హక్కు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. హోదా వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఒంగోలులోని తన నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి ఎంపీ వైవీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. చంద్రబాబులా స్వార్థం కోసం ప్యాకేజీ తీసుకోవడానికి పనిచేయడం లేదన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్‌ జగన్‌ గతంలో ఏ విధంగా పోరాడారో.. అదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. హోదా కోసం పోరాడే అన్ని పార్టీలను కలుపుకునిపోతామన్నారు. పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టామని, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు చర్చకు వస్తుందని, ఓటింగ్‌ కూడా వస్తుందన్నారు. ఓటింగ్‌లో ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ప్రజలకు తెలుస్తుందన్నారు. 

అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు నరేగ ఫండ్స్‌ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు చేయడంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. లోకేష్‌ వారి నాన్న చంద్రబాబు మాదిరిగా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలనే సంస్కృతిని ఫాలో అవుతున్నట్లున్నారని దుయ్యబట్టారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రెండు నెలల నుంచి వివిధ సందర్భాల్లో నరేగ ఫండ్స్‌ విషయంపై క్లీయర్‌ చెప్పామన్నారు. తనతో పాటు ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి కేంద్రమంత్రికి, ప్రధానికి రాసిన లేఖలను ప్రెస్‌కు కూడా అందించామన్నారు. నరేగ ఫండ్స్‌ సరిగ్గా వినియోగించడం లేదని, పేదలకు మూడు పూటలా తిండితినేందుకు తెచ్చిన పథకం నీరుగారిపోతుందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, యంత్రాలతో పనిచేయిస్తున్నారని లేఖ రాశామన్నారు. సత్యాలను వక్రీకరిస్తూ చట్టసభను తప్పుదోవ పట్టిస్తున్న నారా లోకేష్‌పై లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌లకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. 

వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వణుకు పుడుతుందని వైవీ విమర్శించారు. బాబు ఆందోళనలో ఉన్నాడు కాబట్టే పాదయాత్రపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. నిజానికి మా పార్టీ నేతలకంటే చంద్రబాబే పాదయాత్రను ఎక్కవగా ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుందన్నారు. హుసేనాపురంలో మహిళా సదస్సు పెడితే.. దానికి పర్మిషన్‌ లేదంటూ పోలీసులతో అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. మహిళలు వారి సమస్యలను ప్రతిపక్ష నేతతో చెప్పుకోవడానికి వస్తే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి వైయస్‌ జగన్‌ నుంచి ప్రజలను ఏ విధంగా దూరం చేయాలని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు అరాచకాలన్నీ ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 
Back to Top