హైదరాబాద్: తెలుగువాడి సత్తా ఏంటో గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూపించిన దమ్మున్న నాయకుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి అని పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పురిటిలోనే చంపేయాలని ఢిల్లీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ గుంట నక్కులు ప్రయత్నించారన్నారు. అయినా వైయస్ జగన్ పార్టీని ఒక శక్తిలా ముందుకు నడిపించారన్నారు. 40 ఏళ్ల వయస్సున్న వైయస్ జగన్ నాయకత్వ పటిమతో పార్టీ పోరాటాలు చరిత్రకెక్కాయన్నారు. ఏ రోజు జననేత రాజకీయ లబ్ధికోసం ఆలోచించలేదని, ప్రజల కోసం నిర్విరామంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారన్నారు.