కిరణ్‌కు చంద్రబాబే ముఖ్య సలహాదారు!

హైదరాబాద్, 22 అక్టోబర్ 2012 : చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నాని, ఈ ప్రభుత్వ ఆయన చెప్పినట్లే నడుస్తోందని షర్మిల విమర్శించారు. చిన్నరంగాపురం నుంచి నాలుగవ రోజు పాదయాత్ర ముందుకు సాగుతుండగా కొందరు వికలాంగులు షర్మిల వద్దకు వచ్చి లక్షా 85 వేల పెన్షన్లను ఏకపక్షంగా రద్దుచేశారనీ, అర్హులైన పెన్షనర్లకు కోత విధించి వారి కడుపులు కాల్చుతున్న ఈ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుందనీ నిందించారు. దీనిపై షర్మిల స్పందిస్తూ చంద్రబాబు చెప్పినట్లే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందన్నారు. పెన్షన్లు ఇవ్వడం వంటివి ఆయనకు నచ్చదనీ, అందుకే ప్రభుత్వం చంద్రబాబు బాటలోనే సాగుతోందని ఆమె ఆక్షేపించారు. జగనన్న సీఎం అయ్యాక వికలాంగులకు రూ. 1,000 పెన్షన్ వస్తుందనీ భరోసా ఇస్తూ ఆమె ముందుకు సాగారు. తర్వాత అరటి రైతులు కలిసి వైఎస్ ఉన్నప్పుడు అరటి తోటలకు 95 శాతం సబ్సిడీతో డ్రిప్‌లు ఇచ్చారనీ,. ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోతే నష్టపరిహారం కూడా రావడం లేదనీ గోడు వెళ్లబోసుకున్నారు.

పాదయాత్ర నాలుగో రోజు ఆదివారం ఉదయం 9.45 గంటలకు పులివెందుల నుంచి ప్రారంభమైంది. యాత్రలో తొలుత స్థానిక మహిళలతో షర్మిల ముచ్చటించారు. ధరలు విపరీతంగా పెరిగాయని, రోజు గడిచే పరిస్థితి లేదని వారు ఆవేదనగా అన్నారు. ఓ మహిళ మైకు తీసుకుని 'మనుషులు బతకలేని పరిస్థితి తెచ్చారు.' అని నిరసన వ్యక్తంచేశారు. ఉప్పు, పప్పు, పెట్రోలు, గ్యాసు, ఎరువులు.. ఒకటేమిటి, అన్ని రేట్లూ పెంచేశారు.. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలూ పెంచేశారు.. ఎలా బతికేది? ఊళ్లో దోమల మందు కొట్టరు.. కరెంటు ఉండదు.. రోజూ నరకం చూస్తున్నాం.. రోగాలతో చస్తున్నాం'... ఆదివారంనాటి పాదయాత్ర సాగిన గ్రామాల్లో షర్మిల వద్ద జనం ఏకరువు పెట్టిన సమస్యలివి. ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై మండిపడ్డారు.  తమ కష్టాలు వినే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కడగండ్లను షర్మిలకు చెప్పుకొన్నారు.
మధ్యాహ్నం 12.10కి పాదయాత్ర ఇప్పట్ల గ్రామానికి చేరుకుంది. ఇక్కడ సమీప గ్రామాల నుంచి భారీగా జనం తరలిరాగా షర్మిల వారిలో కొంతమందితో సభలో మాట్లాడించారు. పావలా వడ్డీ రావడంలేదని మహిళలు ఫిర్యాదు చేశారు. నీళ్లు లేక పంటలు పండక పిల్లలను చదివించలేకపోతున్నామని, పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ.. 'ఇక్కడ బ్రాంచ్ కెనాల్ వైఎస్ హయాంలో 80 శాతం పూర్తయింది. కానీ మిగిలిన 20 శాతం పూర్తిచేయడానికి వీళ్లకు గడిచిన మూడు సంవత్సరాలూ సరిపోలేదు. అది పూర్తయి నీళ్లు వచ్చి ఉంటే పంటలు పండేవి. ప్రతి ఎకరాకు నీళ్లు అందాలన్న రాజన్న స్వప్నం నెరవేరాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి' అని అన్నారు.. అక్కడి నుంచి తేరనామపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర సాగుతుండగా వేలాదిగా మహిళలు వచ్చి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.15కు షర్మిల చిన్నకుడాలలో భోజన విరామం కోసం ఆగారు.  సాయంత్రం 4.30కు తిరిగి పాదయాత్ర ప్రారంభమవగా.. పెద్దకుడాల క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ఎండిన బత్తాయి చెట్లను తీసుకొచ్చి రోడ్డుపై షర్మిలకు చూపారు. 'వైఎస్ ఉన్నప్పుడు చెట్లు ఇచ్చారు. డ్రిప్ ఇచ్చారు. ఐదేళ్లుగా పెంచుకుంటున్నాం. అయితే ఇప్పుడు నీళ్లు లేక చెట్లు ఎండిపోతే.. పరిహారం కోసం అధికారులను కలిశాం. కానీ ఐదేళ్ల వయసున్న చెట్లకు పరిహారం ఇవ్వరట. ఇన్నాళ్లూ మేం పెట్టుబడి పెట్టలేదా?' అని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి పాదయాత్రలో ఉన్న విజయమ్మ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ, కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినా తోటలు చూడలేదనీ, అధికారులతో మాట్లాడినా స్పందనే లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడుతూ  రాజన్న జిల్లా అని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టుందన్నారు. అక్కడి నుంచి ముందుకు సాగగా కడప నగరానికి చెందిన వైద్యుల బృందం పాదయాత్రకు ఎదురేగి సంఘీభావం తెలిపింది.

మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించలేదు!

లింగాల సమీపంలో రాజపుల్లారెడ్డి అనే రైతుకు చెందిన సోయాచిక్కుడు పంట వద్దకు షర్మిల వెళ్లినప్పుడు.. ' నీళ్లు లేక ఐదెకరాల సోయాచిక్కుడు ఎండిపోయింది. కాత లేదు. రెండు బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. వైఎస్ ఉన్నప్పుడు కాలువ తీశాడు. కానీ పూర్తికాక నీళ్లు రాలేదు. లక్ష పోయింది. పరిహారం ఇవ్వమంటే సోయా చిక్కుడుకు వర్తించదని చెబుతున్నారు..' అని ఆ రైతు ఆవేదన వ్యక్తంచేశారు. పక్కనే ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డి స్పందిస్తూ ' సూక్ష్మ నీటి పథకం కింద కెనాల్ పారకంలో భాగంగా 100 సంపులు నిర్మించారు. ఒక్కో సంపు కింద 100 ఎకరాల పారకం ఉంది. కెనాల్ పని పూర్తయితే 10 వేల ఎకరాలు సాగయ్యేది. కానీ 10% పనులు పూర్తిచేయడానికి కూడా వీళ్లకు సమయం సరిపోవడం లేదు.' అని వివరించారు.  ' మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించలేదు. మనకు మంచి రోజులొస్తాయి' అంటూ షర్మిల ముందుకు కదిలారు.
6 గంటలకు జోరుగా వర్షం మొదలైంది. అయినప్పటికీ ఆ వర్షంలోనే తడుస్తూనే షర్మిల ముందుకుసాగారు. తర్వాత లింగాల బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ  ' అన్యాయం, అధర్మం ఎంతో కాలం సాగవు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు ఆటలూ సాగవు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో.. జగనన్న బయటకు వస్తాడన్నదీ అంతే నిజం. మీ అందరి ఆశీస్సులతో రాజన్న రాజ్యం వస్తుంది...' అని పేర్కొన్నారు. అక్కడి నుంచి రాత్రి 8.00కు లోపట్నూతల క్రాస్‌రోడ్డులోని రాత్రి బస స్థలానికి చేరుకున్నారు.
ఆదివారం పులివెందుల నుంచి లోపట్నూతల వరకు 16.2 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో మహిళలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిలతో కలసి షర్మిల చేసిన ఈ పాదయాత్రలో ఉదయం నుంచి భోజన విరామం వరకు దాదాపు 10 వేల మంది కదం తొక్కారు. వీరిలో దాదాపు ఏడెనిమిది వేల మంది మహిళలే!  భోజన విరామం కంటే ముందు చిన్నకుడాల క్రాస్‌రోడ్డు వద్దకు పొద్దుటూరు నుంచి దాదాపు 2,500 మంది మహిళలు తమ పిల్లలను వెంటేసుకుని వచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు.
వీరిలో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ  'నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుకు ధైర్యం రాలేదు. నాన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిహారం ఇచ్చారు. రూ. 200 కోట్ల రుణాలు మాఫీ చేశారు. మరో రూ. 312 కోట్ల రుణమాఫీకి జీవో కూడా జారీ చేసినా.. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదు. ఇంతకుముందు ఎవరూ చేయలేని ఆలోచన నాన్న చేశారు. చేనేత కార్మికులు మగ్గాల మీద పనిచేస్తున్నప్పుడు కంటిచూపు దెబ్బతింటుందన్న ఆవేదనతో వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక ఆ పెన్షన్ రూ. 1,000కి పెరుగుతుంది..' అని పేర్కొన్నారు.

హోరువానలో పాదయాత్ర....

సాయంత్రం లింగాలవైపు పాదయాత్ర సాగుతుండగా 6 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. లింగాల మూడు కిలోమీటర్లు ఉందనగా వర్షం జడివానగా మారింది. అదే వర్షంలో షర్మిల ముందుకు సాగారు. షర్మిలతోపాటే పాదయాత్రలో ఉన్న అభిమానులంతా ముందుకు సాగారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి తోటలు కొట్టేస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షాలు రావడం స్థానికులకు ఆనందాన్ని కలిగించింది.
పాదయాత్రకు జనం భారీగా తరలిరావడంతో ఇంటెలిజెన్స్ అధికారులు ఈ జనం ఎలా వస్తున్నారంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. డబ్బిచ్చి తెచ్చారా అంటూ అడగడం కనిపించింది. ఆదివారం రాత్రి జడివానలోనూ అభిమానుల పాదయాత్ర చూశాక ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఈ అభిమానాన్ని డబ్బిచ్చి కొనలేమని బహుశా ఆ అధికారులకూ అర్థమై ఉంటుందని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానించారు.

Back to Top