కష్టాల్లో ఉండి కూడా వచ్చావామ్మా!

ఏలూరు:

‘కష్టాల్లో ఉన్న మీరు మా కష్టాలు వినడానికి వచ్చారామ్మా’ అంటూ పలువురు మహిళలు ఆమెను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ సీఎం అయితేనే తమ కష్టాలు తీరతాయని వారు చెప్పారు. సోమవారం  పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో విజయమ్మకు ఎదురైన ఈ అనుభవంతో ఆమె కదిలిపోయారు. వారికి భరోసా కల్పించారు. తొలుత తమ్మిలేరు వరదలకు మునిగిపోయిన ఏలూరు పట్టణంలోని వైయస్ఆర్ కాలనీని సందర్శించారు. ఆ తర్వాత విజయమ్మ పోణంగి కాజ్‌వే దాటి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు. అనంతరం పాములదిబ్బ, లంకపేట, ఇజ్రాయిల్ పేటలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు ఎలా ఉన్నాయమ్మా? భోజనం అందుతోందా? అంటూ బాధితులను పలకరించారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వారు వాపోయారు. వారికి ధైర్యం చెప్పి విజయమ్మ ముందుకు కదిలారు. దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నారాయణపురం, నిడమర్రు, గణపవరం, ఉండి ప్రాంతాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తూ భీమవరం చేరుకున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు, మునిగిపోయిన పంటల పరిస్థితి ఏమిటి వంటి విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

పొలాలను చూడాలని పట్టుబట్టిన పాములపర్రు గ్రామస్థులు
పాములపర్రు గ్రామస్తులు విజయమ్మను ఆపి తమ గ్రామంలో దెబ్బతిన్న పొలాలను చూడాలని పట్టుబట్టారు. దీంతో రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి మునిగిన పొలాలను చూసి రైతులతో మాట్లాడారు. రాత్రి 8.30 గంటలకు భీమవరం చేరుకున్నారు. విజయమ్మ వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆళ్ల నాని, మద్దాల రాజేష్, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, జ్యేష్ట రమేష్‌బాబు, మేకాప్రతాప్ అప్పారావు, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం నిద్రపోతోంది : నాగిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి విమర్శించారు. తుపాను వచ్చి నాలుగురోజులైనా సీఎం ఇంతవరకు పర్యటించకపోవడం దారుణమని చెప్పారు. రైతులను ఆదుకునే విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

ఎదురుపడ్డ విజయమ్మ, బాబు కాన్వాయ్‌లు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు వద్ద వైఎస్ విజయమ్మ, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లు ఎదురుపడ్డాయి. టీడీపీ కార్యకర్తలు విజయమ్మ కాన్వాయ్‌పైకి దూసుకువచ్చారు. ఒకదశలో ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది. వైయస్ఆర్ సీపీ నాయకుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు వారికి సర్దిచెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి మాగంటి బాబు కూడా విజయమ్మ కాన్వాయ్ దాటేవరకూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందు నడిచారు. అదే సమయంలో విజయమ్మతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలే ప్రయత్నించారు. వారు చంద్రబాబును పట్టించుకోలేదు.

Back to Top